తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఏప్రిల్ 9న) శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఓ ప్రకటనలో తెలిపింది. ఉగాది పర్వదినం సందర్బంగా రేపు ఉదయం 3 గంటలకు సుప్రభాతం సేవ నిర్వహించిన తర్వాత శుద్ధి చేస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, విష్వక్సేనుల స్వామికి విశేష సమర్పణ చేయనున్నట్లు పేర్కొన్నారు.
Read Also: AP News: ఏపీలో బదిలీ అయిన ఐఏఎస్ అధికారులకు పోస్టింగులు..
అలాగే, రేపు ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించనున్నారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింప చేసి పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించనున్నారు. బంగారు వాకిలి దగ్గర ఉగాది ఆస్థానాన్ని ఆగమ పండితులు, అర్చకులు నిర్వహించనున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు (ఏప్రిల్ 9న) ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ క్యాన్సిల్ చేసింది. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా రద్దీగా ఉన్న తిరుమల క్షేత్రంలో ఇవాళ భక్తుల కోలాహలం తగ్గినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తున్నారు.