*రేపే ఓట్ల లెక్కింపు.. సర్వం సిద్ధం చేసిన అధికారులు
రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలు కానుంది. ఈ క్రమంలో స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల వద్దు బందోబస్తుగా ఉన్నారు. కాగా.. ఓట్ల లెక్కింపు మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బందిని ఉంచనున్నారు. అంతేకాకుండా.. కౌంటింగ్ కోసం మొత్తం 1,766 టేబుల్స్ ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా కొనసాగుతుంది. కాగా.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, వీరిలో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్జెండర్ ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో మొట్ట మొదట భద్రాచలం, చివరగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఫలితం వెళ్లడయ్యే అవకాశం ఉంది.
*హైదరాబాద్లో కౌంటింగ్ కేంద్రాల పరిశీలన.. కౌంటింగ్కు అంతా సిద్ధం
హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో.. శనివారం సికింద్రాబాద్ వెస్లీ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను ముందుగా పరిశీలించారు. అనంతరం అంబర్ పేట్ జీహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మలక్ పేట్ కౌంటింగ్ సెంటర్, ప్రొ.జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ కౌంటింగ్ సెంటర్, దోమలగూడ ఏ.వి కాలేజ్ లో ఏర్పాటు చేసిన ముషీరాబాద్ కౌంటింగ్ సెంటర్, నారాయణగూడ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ (జి.ఎఫ్ అండ్ ఓపెన్ గ్రౌండ్) ఏర్పాటు చేసిన అంబర్ పేట్ కౌంటింగ్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పరిశీలించారు. అనంతరం.. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో ఏర్పాటు చేసిన సనత్ నగర్ కౌంటింగ్ సెంటర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యాతో కలిసి ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… కౌంటింగ్ సెంటర్ లోకి ఎవ్వరికీ సెల్ ఫోన్లు అనుమతి లేదని తెలిపారు. ఏజెంట్లు, కౌంటింగ్ నియమించిన సిబ్బంది అందరూ ఉదయం 5 గంటల వరకు కౌంటింగ్ సెంటర్ కు రావాలని తెలిపారు. కౌంటింగ్ కు 14 టేబుల్ ఏర్పాటు చేయగా.. మూడంచెల బందోబస్తు, మొదటి దశలో సివిల్ పోలీస్, రెండవ దశలో స్టేట్ ఆర్మీ పోలీస్, మూడవ దశలో కేంద్ర బలగాలు ఉంటాయని తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఉదయం 9 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. ఉదయం 9:30 గంటలకు మొదటి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు ముగుస్తుందని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఒక్కో నియోజకవర్గానికి ఒక సాధారణ పరిశీలకులను నియమించిందని, సాధారణ పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని రోనాల్డ్ రోస్ తెలిపారు.
*తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుఫాన్గా మారుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. తుఫాన్ పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. ఈనెల 4వ తేదీన నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత 8 జిల్లాలకు ముందస్తుగా ఏపీ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. తుఫాన్ నేపథ్యంలో అధికారులకు సీఎం జగన్ పలు ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకూడదని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలన్నారు. కరెంట్, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రక్షిత తాగునీరు, ఆహారం, పాలు శిబిరాల్లో ఏర్పాటు చేసుకోవాలని, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
*నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.. అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ నాయకత్వంలో ఏపీకి నీళ్ల కోసం పోరాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మన హక్కుల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్రానికి పట్టిన దుస్థితి అన్న ఆయన.. చంద్రబాబు రాష్ట్ర రైతుల ద్రోహిగా మిగిలిపోయాడని తీవ్రంగా విమర్శించారు. గతంలో సాగర్పై నీటి కోసం యుద్ధం చేసి టీడీపీ నేతృతంలోని ఏపీ ప్రభుత్వం ఓడిపోయిందని.. నేడు సీఎం జగన్ నేతృత్వంలో నీటి కోసం జరిగిన పోరాటంలో చర్చలు జరుగుతున్నాయన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణ నీళ్లు తోడుకొని పోతున్న మాట్లాడలేని దుస్థితిలో గత ఏపీ ప్రభుత్వం ఉండేదన్నారు. చంద్రబాబు అసమర్ధత వల్లే తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకునేదని ఆయన అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని ఇష్టారాజ్యంగా తెలంగాణ వాడుకుందన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం నోరెత్తి మాట్లాడలేదు చివరకు నాగార్జున్ సాగర్ కుడికాలువ తాళాలు కూడా తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉంచుకున్నారని ఆయన విమర్శించారు. మన నీటిని మనం సాధించుకోవడానికి పోలీస్ యాక్షన్ ద్వారా ప్రయత్నం చేస్తే జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు. మా హక్కులు కాపాడుకోవడం కోసం వెళ్తే అది దండయాత్ర ఎలా అవుతుందని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ దురదృష్ట పరిస్థితులు ఎదురవటానికి ., 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన దిక్కుమాలిన పాలనే కారణమని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుపై ఉన్న కేసుల వల్లే తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయాడని ఆయన ఆరోపించారు. గతంలో కృష్ణా బోర్డుకు ఇండెంట్ ఇవ్వకుండానే తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నీటిని వాడుకుందని మంత్రి అన్నారు.
*తుఫాన్ ఎఫెక్ట్.. నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుఫాన్గా మారుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈనెల 4వ తేదీన నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత 8 జిల్లాలకు ముందస్తుగా ఏపీ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండా.. మైపాడు తీరంలో సముద్ర కెరటాల ఉద్ధృతి పెరిగింది. నెల్లూరులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు, లోతట్టు ప్రాంతవాసులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో ఆస్తి, ప్రాణనాష్టం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ చెప్పారు. కలెక్టరేట్లో 24 గంటలు పని చేసే కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల సిబ్బందిని సమాయత్తం చేశామని ఆయన వెల్లడించారు. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. సోమవారం జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామని ఆయన స్పష్టం చేశారు.
*మహిళపై రేప్ కేసు పెట్టవచ్చా..? పరిశీలిస్తామన్న సుప్రీం..
సాధారణంగా పురుషులే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటారు. అయితే మహిళపై అత్యాచార కేసు పెట్టవచ్చా..? అనేది ప్రశ్న. అయితే దీనిని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ అత్యాచార కేసులో ఒక మహిళ పిటిషన్ వేయడంతో దీన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 61 ఏళ్ల మహిళపై ఆమె కోడలు పెట్టిన కేసులో స్పందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. మహిళపై రేప్ కేసు పెట్టవచ్చా..? లేదా..? అనే అంశాన్ని పరిశీలించేందుకు న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, సంజయ్ కరోల్లతో కూడిన ధర్మాసనం సిద్ధమైంది. మహిళను అరెస్టు నుంచి రక్షణ కల్పించి, విచారణకు సహకరించాల్సిందిగా ఆదేశించింది. పంజాబ్కి చెందిన 61 ఏళ్ల మహిళ, గతేడాది సెప్టెంబర్ నెలలో పెద్ద కొడుకుకి ఓ యువతితో వివాహం జరిపించింది. ఆమె కొడుకు అమెరికాలో ఉండగా.. వర్చువల్గా పెళ్లి జరిపించింది. పెళ్లి జరిగిన తర్వాత ఆమె కొడుకు స్వదేశానికి రాలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత పోర్చుగల్ దేశంలో ఉండే చిన్న కొడుకు స్వదేశానికి వచ్చారు. కొన్ని రోజులు కుటుంబంతో ఉండీ మళ్లీ విదేశాలకు వెళ్లిపోయాడు. అయితే కొన్నాళ్లకు కోడలు, అత్తా, ఆమె చిన్న కుమారుడిపై అత్యాచార ఆరోపణలు చేసింది. తన న్యూడ్ ఫోటోలు చూపించి, తనపై అత్యాచారం చేసినట్లు చెప్పింది. ఇందుకు తన అత్తగారు సహకరించారని ఫిర్యాదు చేసింది. పోలీసులు కోడలు ఫిర్యాదులో అత్తా, చిన్న కుమారుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులఅో ముందస్తు బెయిల్ కోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ బెయిల్ కోసం కింది కోర్టులను ఆశ్రయించగా.. ఆమె పిటిషన్ని కొట్లటేశారు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
*ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పోస్ట్..
యూఏఈ దుబాయ్ వేదికగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు( COP28)ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరయ్యారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని నరేంద్రమోడీ సెల్ఫీ ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. జార్జియా మెలోని, ప్రధాని మోడీతో దిగిన సెల్ఫీని ‘మెలోడీ’ హాష్ ట్యాగ్తో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీన ఈ పోస్టుని రీట్వీట్ చేస్తూ..‘‘ స్నేహితులను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’’ అని రాశారు. ప్రస్తుతం జార్జియా మెలోని పోస్ట్ వైరల్ గా మారింది. #Melodi కేవలం కొన్ని నిమిషాల్లోనే టాప్ ట్రెండ్గా మారింది. ఇప్పటికే ఈ పోస్ట్కి 24 మిలియన్ల కన్నా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. శుక్రవారం దుబాయ్లో జరిగిన COP28 సదస్సులో భాగంగా ఇటలీ ప్రధాని ఈ సెల్ఫీని తీశారు. ఈ ఏడాది భారత్లో జరిగిన జీ20 సమ్మిట్ నుంచి ‘మెలోడి’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇద్దరు ప్రధానుల మధ్య ఫ్రెండ్షిప్ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు ప్రధానులు కూడా పలు విషయాల గురించి చర్చించారు. పలు విషయాలపై చర్చించిన ప్రధానులు నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీనిపై నెటిజన్లు తెగస్పందిస్తున్నారు.
*ప్రమాదం అంచున జపొరిజ్జియా అణు కర్మాగారం..
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా ఉన్న జపొరిజ్జియా మరోసారి వార్తల్లో నిలిచింది. యూరప్ లోనే అతిపెద్ద అణు విద్యుత్ కర్మాగారం ఇక్కడే ఉంది. ఇదిలా ఉంటే జపొరిజ్జియా అణు కర్మాగారాన్ని, ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్కి అనుసంధానించే రెండు విద్యుత్ లైన్లను రాత్రిపూట కట్ చేశారు. దీంతో ప్లాంట్కి ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ శనివారం తెలిపింది. గతేడాది ప్రారంభమైన ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు పక్షాలు కూడా ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడే ఉన్న అణు ప్లాంట్ ప్రమాదంలో పడింది. ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయిన కారణంగా.. అణు విద్యుత్ ప్లాంట్ 20 డిజిల్ జనరేటర్ల నుంచి సొంత అవసరాలకు శక్తిని సమకూర్చుకుంటోందని ఉక్రెయిన్ న్యూక్లియర్ ఎనర్జీ ఆపరేటర్ చెప్పారు. విద్యుత్ని పునరుద్ధరించే వరకు ప్లాంట్ ‘న్యూక్లియర్, రేడియేషన్ యాక్సిడెంట్’ ప్రమాదం అంచున ఉందని పేర్కొంది. ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ నుంచి ప్లాంట్కి విద్యుత్ సరఫరా పునరుద్దరించిన ఉక్రెయిన్ నిపుణులు, సత్వర చర్యల ద్వారా ప్రమాదాన్ని నివారించినట్లు పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైన తర్వాత ఇలా బ్లాక్ అవుట్ కావడం ఇది 8వ సారని, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ శనివారం ధృవీకరించింది. అధికారులు ప్లాంట్లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఓవర్ హీటింగ్ కాకుండా నిరంతరం నిర్వహణ చర్యలను చేపడుతున్నారు. జపోరిజ్జియాలోని ఆరు రియాక్టర్ల ప్లాంట్ గత 21 నెలల సంఘర్షణల్లో పదేపదే దాడికి గురవుతోంది. డ్రోన్ దాడులతో ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. సెప్టెంబర్ 2022లో ఉక్రెయిన్ గ్రిడ్కి విద్యుత్ సరఫరాని నిలిపేసింది.
*భారీ ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న పాకిస్తాన్..
ఉగ్రవాదులకు స్వర్గధామంగా ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న పాకిస్తాన్, ఇప్పుడు ఆ ఉగ్రవాదానికే బలవుతోంది. పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ముక్యంగా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ)తో పాటు మరికొన్ని ఉగ్రసంస్థలు అక్కడి పోలీస్ అధికారులను, సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నాయి. టీటీపీకి మంచి పట్టున్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా, వజీరిస్తాన్ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతోంది. మరోవైపు బెలూచిస్తాన్ పోరాటయోధులు తమ స్వాతంత్య్రం కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. వీరు చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ని, పాక్ సైన్యాన్ని, చైనీయులను టార్గెట్ చేసుకుంటూ బలూచిస్తాన్, సింధ్ ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య పాకిస్తాన్, పాక్ తాలిబాన్లను అరికట్టాలని ఆఫ్ఘన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ భారీ ఉగ్రదాడి నుంచి తప్పించుకుంది. పంజాబ్ ప్రావిన్సులో అతిపెద్ద ఉగ్రదాడిని అక్కడి అధికారులు భగ్నం చేశారు. 14 మంది పాక్ తాలిబాన్, ఐఎస్ఐ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నిషేధిత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ లోని వివిధ జిల్లాల్లో తాము 147 ఇంటెలిజెన్స్ ఆధారిత దాడులు చేశామని, కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్(సీటీడీ) పంజాబ్ తెలిపింది. గుజ్రాన్వాలా, బహవల్పూర్, సాహివాల్, ఫైసలాబాద్, సర్గోధా జిల్లాలతో పాటు లాహోర్ నగరంలో ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులు నిర్వహించారు. పట్టుబడిని వారికి ఐఎస్ఐఎస్, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టిటిపి)లకు చెందిన ఉగ్రవాదులతో పాటు లష్కరే ఝాంగ్వీ(ఎల్ఈజే) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పాక్ అధికారులు తెలిపారు. వీరంతా పంజాబ్ ప్రావిన్సులో విధ్వంసానికి ప్లాన్ చేశారని సీటీడీ అధికారులు చెప్పారు. ఉగ్రవాదుల నుంచి దాదాపు 4.3 కిలోల పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, నాలుగు ఐఈడీ బాంబులు, 20 డిటోనేటర్లు, 32 అడుగుల సేఫ్టీ ఫ్యూజ్ వైర్, 6.5 అడుగుల ప్రైమా కార్డ్, నిషేధిత సాహిత్యం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులపై 13 కేసులు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ కోసం వారిని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు.