ఆసియా కప్ 2025 ట్రోఫీ కాంట్రవర్సరీపై తెలుగు ఆటగాడు, టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ స్పందించాడు. సెప్టెంబర్ 28న పాకిస్థాన్తో ఫైనల్ అనంతరం తాము గంటసేపు మైదానంలోనే గడిపాము అని, గ్రౌండ్లో ట్రోఫీ ఎక్కడా కనిపించలేదని చెప్పాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతిలో ట్రోఫీ లేదని చెప్పాడు. అందుకే ట్రోఫీ అందుకొన్నట్లుగా తాము క్రియేట్ చేశాం అని తిలక్ తెలిపాడు. ఫైనల్లో భారత్ గెలిచినా.. నఖ్వీ ఇప్పటివరకు ట్రోఫీ ఇవ్వని విషయం తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తిలక్ వర్మ మాట్లాడుతూ…’దుబాయ్ మైదానంలో అందరం ఆసియా కప్ 2025 ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్నాం. దాదాపు గంట గడిచినా ట్రోఫీ మా చేతికి రాలేదు. అందరూ టీవీల్లో చూసుంటారు. టీమిండియా ప్లేయర్స్ చాలామంది మైదానంలోనే పడుకొని ఉన్నాం. అర్ష్దీప్ సింగ్ మాత్రం రీల్స్ చేస్తూ అందరిని అలరించాడు. మైదానంలో ఎక్కడా కూడా మాకు ట్రోఫీ కనిపించలేదు. చాలా సమయం అయ్యాక.. అర్ష్దీప్ ట్రోఫీ అందుకొన్నట్లుగా క్రియేట్ చేశాడు. అందరం అతడిని ఫాలో అయ్యాం. టీ20 ప్రపంచకప్ 2024 సమయంలో ఎలా సంబరాలు చేసుకున్నామో ట్రోఫీ లేకున్నా అలాగే చేశాం’ అని తెలిపాడు.
Also Read: Prabhas-Spirit: ఆ విలనే కావాలి.. ఏంది మావా ఈ రచ్చ?
ఆసియా కప్ 2025 ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 146 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ మరో రెండు బంతులు ఉండగానే 5 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 20 పరుగులకే మూడు వికెట్స్ కోల్పోయిన టీమిండియాను తిలక్ వర్మ ఆదుకున్నాడు. 53 బంతుల్లో 69 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత ప్లేయర్స్ నిరాకరించారు. దాంతో నఖ్వీ ట్రోఫీని ఏసీసీ కార్యాలయంలో పెట్టి పాక్ వెళ్ళిపోయాడు. ఏ బీసీసీఐ అధికారి అయినా లేదా భారత ఆటగాడు అయినా తన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవచ్చు అని కండిషన్ పెట్టాడు. ఇందుకు బీసీసీఐ అంగీకరించడం లేదు. దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ సిద్దమైంది.