Accident in Alluri District: అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డుపై వెళుతుండగా ఒక్కసారిగా కారు అదుపతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలతో సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలాగాడ గ్రామానికి చెందిన చెండా సుబ్బారావు ఎల్ఐసీలో అడిషనల్ డివిజల్ అధికారిగా పనిచేస్తున్నారు. ఉద్యోగ నిమిత్తం భార్య మహేశ్వరి, పిల్లలతో కలిసి విశాఖపట్నంలో నివసిస్తున్నారు. అయితే గంగదేవత జాతర వుండటంతో దంపతులిద్దరు సమీప బంధువు పూర్ణచంద్రారావుతో కలిసి స్వగ్రామానికి వెళ్లారు. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులతో కలిసి ఆనందంగా జాతర జరుపుకున్నారు. మంగళవారం జాతర ముగియడంతో వీరంతా బుధవారం రాత్రి విశాఖపట్నంకు తిరుగు పయనం అయ్యారు. అయితే పాడేరు ఘాట్ రోడ్డులో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. వంట్లమామిడి సమీపంలోని కోమలమ్మ పనుకు దగ్గరగల మలుపులో కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టి లోయలోకి పడిపోయింది. కారు డ్రైవర్ ఉమామహేశ్వరరావు, చెండా మహేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా.. సుబ్బారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Drugs Caught: కొకైన్ తరలించేందుకు కొత్త స్కెచ్.. అడ్డంగా బుక్కైన కిలాడి లేడి
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి తీవ్రంగా గాయపడిన సుబ్బారావు, పూర్ణచంద్రరావును అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. పాడేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సుబ్బారావు ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన పూర్ణచంద్రారావు పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సుబ్బారావు -మహేశ్వరి దంపతుల మృతితో స్వగ్రామం కిలాగడలో విషాదఛాయలు అలుముకున్నాయి.