జేఈఈ మెయిన్ చివరి విడత(నాలుగు) పరీక్షలు దేశవ్యాప్తంగా గురువారం మొదలుకానున్నాయి. ఈ నెల 26, 27, 31, సెప్టెంబరు 1, 2వ తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత నుంచి బీటెక్ కోసం పేపర్-1 నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 7.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత దేనిలో అధిక స్కోర్ వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి ర్యాంకులు కేటాయించనుంది. ఇది ఇలా ఉండగా.. ఇవాళ్టి నుంచి జరిగే ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మాస్క్ లు ఉంటేనే విద్యార్థులను అనుమతి ఇస్తామని చెబుతున్నారు. కరోనా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.