Telangana AP water row on Banakacherla Project: ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు ససేమిరా అంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బనకచర్లపై జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ అభ్యంతరాలు తెలిపాయని పేర్కొంది. ఇప్పటి వరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని తెలంగాణ సర్కార్ లేఖలో ప్రస్తావించింది. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఢిల్లీలో కేంద్ర మంత్రి సమక్షంలో బుధవారం (జులై 16) జరిగే తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇచ్చింది. ఇప్పటికే కృష్ణాపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో ఇప్పటికే ఎజెండాను తెలంగాణ సర్కార్ పంపింది.
Also Red: Mohammed Siraj: సిరాజ్.. ఎంతపని చేశావయ్యా! వీడియో వైరల్
ఏపీ ఇచ్చిన బనకచర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈరోజు ఉదయాన్నే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. రేపటి సమావేశంలో బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని లేఖలో స్పష్టం చేసింది. జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయని.. ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి వివరాలను ఈ లేఖలో ప్రస్తావించింది. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని ఉటంకించారు. గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని లేఖలో ప్రస్తావించింది.