Minister Sridhar Babu : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను హిట్లర్ పరిపాలనతో పోలుస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్వయంగా తానే ఒక హిట్లర్నని ప్రకటించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, అందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రదర్శించారు.
డిసిప్లేన్ వేరు.. డిక్టేటర్షిప్ వేరు..!
హిట్లర్ అనే పదంపై మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వివరణ ఇచ్చారు. గతంలో చిరంజీవి హీరోగా ‘హిట్లర్’ అనే సినిమా కూడా వచ్చిందని, సమాజంలో క్రమశిక్షణను (డిసిప్లేన్) ఆశించే ఉద్దేశంతో సాధారణ జనబాహుళ్యంలో ఈ పదాన్ని వాడుతుంటారని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన నాజీ హిట్లర్ వేరు, సాధారణంగా వాడే హిట్లర్ వేరు అని స్పష్టం చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదాన్ని డిక్టేటర్షిప్ (సర్వాధికార పాలన) అని ప్రచారం చేయడం సరికాదన్నారు. “కేటీఆర్.. మీ నాన్న కేసీఆర్ కూడా నేను హిట్లర్ని అన్నప్పుడు మీ సమాధానం ఏంటి?” అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ పాలనలో సెక్రటేరియట్కు పదేళ్ల పాటు ఇనుప కంచెలు వేసి, ప్రగతి భవన్ను నాజీల బంకర్ తరహాలో మార్చారని, అది గాంధీ మార్గమా అని నిలదీశారు. హైదరాబాద్లోని చెరువులను కబ్జాల నుండి కాపాడాలనే సీఎం రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంలో భాగమే ఈ కఠిన నిర్ణయాలని వెల్లడించారు.
హరీష్ రావు యాత్రలపై మండిపాటు: అబద్ధాల ప్రచారం
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ పోటాపోటీగా రాజకీయ యాత్రలు చేస్తూ ప్రజల్లోకి అసత్యాలను తీసుకువెళ్తున్నారని శ్రీధర్ బాబు విమర్శించారు. పెద్దపల్లికి వెళ్లిన హరీష్ రావు అక్కడ భూముల ధరలు తగ్గాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎక్కడైనా భూముల ధరలు తగ్గుతాయా అని ప్రశ్నించిన మంత్రి.. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నేతలు ల్యాండ్ మాఫియాతో చేతులు కలిపి కృత్రిమంగా ధరలు పెంచారని, అప్పట్లో సామాన్యుడు గజం భూమి కొనాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని ఆరోపించారు. సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటూ సత్యదూరమైన విషయాలను నిజాలుగా చిత్రీకరిస్తున్నారని, హరీష్ రావు ఇప్పటికైనా హుందాతనంగా వ్యవహరించాలని హితవు పలికారు.
రెండేళ్లలోనే 70 శాతం హామీల అమలు
తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం రెండున్నర ఏళ్లలోనే ఏకంగా 70 శాతం హామీలను నెరవేర్చిందని మంత్రి శ్రీధర్ బాబు గర్వంగా ప్రకటించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే, ఆ ప్రజాదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు విసిగిపోతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తామిచ్చిన హామీల్లో సగం కూడా నెరవేర్చలేదని, అలాంటి వారికి తమను విమర్శించే హక్కు లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది చనిపోతే కేవలం 400 మందికి మాత్రమే ఆర్థిక సాయం అందించి, మిగిలిన 800 మందిని బీఆర్ఎస్ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు.
సింగరేణికి బీఆర్ఎస్ చేసిన ద్రోహం
సింగరేణి సంస్థను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణి సంస్థకు ప్రభుత్వం నుండి రావాల్సిన 40 వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు. సింగరేణిలో ఉన్న కాంట్రాక్టర్లలో ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతల బంధువులేనని, ప్రైవేట్ బొగ్గు డిపోలకు అనుమతులు ఇచ్చింది కూడా వారేనని స్పష్టం చేశారు. అలాగే మెడికల్ బోర్డు వివాదానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు.
అధికారులను బెదిరిస్తే ఊరుకోం
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కాదు, బీఆర్ఎస్ అరాచక పాలనపై విసిగిపోయి ఎన్నికల్లో సరైన జవాబు చెప్పారని మంత్రి అన్నారు. మునిగిపోయే కారులో కూర్చున్న బీఆర్ఎస్ నేతలకు వచ్చే ఎన్నికల్లో కనీసం 10 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వస్తున్నాం.. మీ సంగతి చెప్తాం అంటూ చట్ట ప్రకారం పనిచేసే అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్షాల చప్పుళ్లకు భయపడాల్సిన అవసరం లేదని, చట్టానికి లోబడి పనిచేసే అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

