ప్రాకృతిక సౌందర్యం, సంస్కృతి, కళలకు పెట్టింది పేరైన తెలంగాణ గ్రామాలు, కళలకు కేంద్ర ప్రభుత్వం సరైన గౌరవాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే తెలంగాణ కళలకు, సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు రావడంలో కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుంది. తాజాగా మరో రెండు తెలంగాణ గ్రామాలను ఈ సంవత్సరానికి గానూ ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేసింది. ఈ అవార్డులకు ఎంపికైన మొదటి గ్రామం జనగామ జిల్లా పెంబర్తి.. కాకతీయుల కాలం నుంచి ఈ గ్రామం హస్తకళలకు ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. ఇత్తడి, కంచు లోహాలతో ఈ గ్రామంలో చేసే కళాకృతులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని పెద్ద మొత్తంలో అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.
Read Also: Khalistani Group: కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద నిరసనలకు ఖలిస్థానీ గ్రూప్ పిలుపు
సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళా ఖండాలు, గృహ అలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. దీనికి తోడు ఏటా 25 వేల మంది పర్యాటకులు ఈ పెంబర్తి గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి తద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు తదతర అంశాలను దృష్టిలో ఉంచుకుని.. పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ గుర్తింపు విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుంది. ఇక, ఇనుము వినియోగం తెలియక ముందు నుంచే.. రాగి, ఇతర మిశ్రమ లోహాల సహాయంతో కాకతీయుల కాలం నుంచి పని ముట్లను, రోజూవారీ వినియోగ వస్తువుల తయారీకి పెంబర్తి కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే.
Read Also: Ponguleti: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకుందాం..!
ఈ అవార్డులకు తెలంగాణ నుంచి ఎంపికైన రెండో గ్రామం సిద్దిపేట జిల్లా చంద్లాపూర్.. రంగనాయక స్వామి దేవాలయం, రంగనాయక కొండలు, ఇక్కడి ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే.. ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభామ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యానికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబోతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నెత్తిన చల్లకుండ, చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీరల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. రంగనాయక స్వామి దేవాలయం, పరిసర ప్రాంతాలు గ్రామీణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన నేపథ్యంతో పాటుగా ఇక్కడి గొల్ల భామల చీరలకున్న ప్రత్యేకత కారణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also: Atchannaidu: చంద్రబాబుపై కేసు నూటికి లక్ష శాతం కక్ష సాధింపే.. ప్రాథమిక ఆధారాలు కూడా లేవు..!
ఈ అవార్డులను సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేయనున్నారు. తెలంగాణ ప్రాంతంలోని కళాకృతులకు నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని కల్పిస్తోంది. ఏ అంతర్జాతీయ వేదికైనా.. ఇటీవల జరిగిన జీ-20 సమావేశాలైనా.. భూదాన్ పోచంపల్లి ఇక్కత్ చీరలను, ఇక్కడి నేతన్నలు నేసిన కండువాలను వివిధ దేశాల అధినేతలకు, విదేశీ ప్రముఖులకు ప్రధాని మోడీ అందజేశారు. వివిధ విభాగాలకు సంబంధించిన జీ20 సమావేశాలకు హాజరైన విదేశీ ప్రతినిధులకు కూడా పోంచపల్లిలో నేసిన చీరలను కేంద్ర ప్రభుత్వం ద్వారా గిఫ్ట్లుగా అందించింది. 2021లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి UNWTO ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు కల్పించే విషయంలోనూ కేంద్రప్రభుత్వం ప్రత్యేక చొరవతీసుకుంది.