Rajnath Singh: ‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్ కావడానికి కారణం అదే.. రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు

  • ఆపరేషన్ సిందూర్ విజయం ప్రశంసనీయం
  • సాయుధ దళాలు పరాక్రమాన్ని అభినందిస్తున్న
  • ప్రపంచం మొత్తం భారతదేశం ధైర్యాన్ని చూసింది
  • ఈ దాడిలో అమాయకులు చనిపోలేదు
  • రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వ్యాఖ్యలు
Rajnath Singh

Rajnath Singh

ఆపరేషన్ సిందూర్ విజయం ప్రశంసనీయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన సాయుధ దళాలు నిన్న తీసుకున్న చర్యకు, వారు ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన రక్షణ మంత్రి పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను మన దళాలు ధ్వంసం చేసిన విధానం మనందరికీ గర్వకారణమన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ ఖచ్చితత్వంతో నిర్వహించారన్నారు. ఈ ఆపరేషన్‌లో 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని.. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారని స్పష్టం చేశారు. ఇందులో ఏ అమాయకుడు కూడా చనిపోలేదని రాజ్‌నాథ్‌సింగ్ పునరుద్ఘాటించారు. మన దళాల వద్ద అద్భుతమైన ఆయుధాలు ఉండటం వల్ల ఇది సాధ్యమైందన్నారు. నిన్న ప్రపంచం మొత్తం భారతదేశం ధైర్యాన్ని చూసిందన్నారు. భారత్‌ తనను తాను రక్షించుకోవడానికి దాడులు చేసింది. మన సైన్యం అంత్యంత తెగువ చూపిందని కొనియాడారు.

READ MORE: Operation Sindoor: “అంతా సిద్ధం” ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం..

అంతకు ముందు.. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ ‘ఆపరేషన్‌ సిందూర్‌ లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆపరేషన్‌ వివరాలను గురువారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో వెల్లడించారు. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పహల్గాంలో అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బదులు చెప్పింది. పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది.