Off The Record: గుళ్ళో అఖండ దీపంలాగే… తెలంగాణ కాంగ్రెస్లో నిత్య అసంతృప్తి అన్నది కామన్. పార్టీ అధిష్టానాన్ని తప్ప మిగతా నాయకులు ఎవరు ఎవరి మీదైనా బహిరంగ వ్యాఖ్యలు చేసే స్వేచ్ఛ ఉంటుంది. అందుకు స్థాయీ భేదాలేమీ ఉండవు. అయితే కొంత కాలంగా టి కాంగ్రెస్ పరిణామాల్ని చూస్తున్నవారికి అసలు అసమ్మతి అన్నది కాంగ్రెస్ లీడర్స్కి ఇన్బిల్ట్ డీఎన్ఏలా మారిపోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. ఇటీవల జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్కి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆలస్యంగా రావడంపై చిటపటలాడుతున్నారు సీనియర్స్. పరస్పరం ఓదార్పు కాల్స్ కుడా చేసుకున్నారట. మనం చెప్తే వినే వాళ్ళు ఎవరు..? విన్నా పట్టించుకునే వాళ్ళేరీ అన్న చర్చ వాళ్ళ మధ్య అంతర్గతంగా జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. సమావేశానికి రేవంత్ ఆలస్యంగా రావడాన్ని థాక్రేతో సీనియర్లు ప్రస్తావించినా… పెద్దగా లాభం లేకపోయిందట. గతంలో ఇన్చార్జిగా ఉన్న ఠాగూర్ సమస్యలు వినట్లేదని సీనియర్లు అభ్యంతరపెట్టారు. అందుకే అధిష్టానం ఆయన్ని మార్చి థాక్రేని పంపింది. ఠాగూర్ పోయినా… థాక్రే వచ్చినా… సీన్ సేమ్ అట. ఆయన అస్సలు వినలేదు. ఈయన విన్నా యాక్షన్ లేదన్న ఆవేదనతో ఉన్నారట టి కాంగ్ సీనియర్స్. థాక్రే కావాలనే పట్టించుకోవడంలేదా? లేక తెలంగాణలో త్వరలో నేరుగా అధిష్టానమే రంగంలోకి దిగబోతోంది కాబట్టి మధ్యలో నాకెందుకని అనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది.
Read Also: Minister Harish Rao: త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభం
కొద్ది రోజులుగా సీనియర్స్ తమ అభ్యంతరాలను ఎప్పటికప్పుడు థాక్రే తో.. పాటుగా అధిష్టానం పెద్దల దృష్టికి కూడా తీసుకువస్తున్నారట. మరి కొంతమంది నేరుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగారు. అదింకా ఖరారవలేదు. దీంతో తాము చెప్పాలనుకున్నా… వినాలన్న ఉద్దేశ్యం పార్టీ పెద్దల్లో లేదా అన్న ప్రశ్న టీ కాంగ్రెస్ సీనియర్స్ మెదళ్ళని తొలిచేస్తోందట. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ అధినాయకత్వమే నేరుగా రంగంలోకి దిగుతుందని చెప్పుకుంటున్నారు. ఇలాంటి టైంలో..ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి సీనియర్ల అభ్యంతరాలను చేరవేసే పోస్ట్మ్యాన్ డ్యూటీ తప్ప ఇంకేం చేస్తారన్న వాదన కూడా పార్టీలో ఉంది. మరోవైపు పార్టీ అంతర్గత నిర్మాణానికి సంబంధించి ముఖ్య నాయకుల్ని పదేపదే హెచ్చరిస్తున్నారు థాక్రే. మండల కమిటీలు వేయమని నెల రోజులుగా వెంటపడుతున్నారాయన. అందుకు డీసీసీల నుంచి గాని, సీనియర్స్ నుంచిగాని స్పందనే లేదట. దీని కోసం ఇప్పటికే గాంధీభవన్లో రెండు మీటింగ్లు పెట్టారు. ఉపాధ్యక్షులతో సమీక్షలు చేశారు. నియామకాలు ఎందాకా వచ్చాయో ఫాలోఅప్ చేసే బాధ్యతను ఒక నాయకుడికి అప్పగించారు.
Read Also: Minister Harish Rao: త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభం
అయినా పురోగతి పెద్దగా కనిపించకపోవడంతో.. డీసీసీలు కూడా ఇన్ఛార్జ్ని లైట్ తీసుకుంటున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. మండల కమిటీల్ని నియమించకుంటే.. ఆయనొచ్చి పొడుస్తాడా ఏంటన్న భావనతో కింది స్థాయి నాయకులు ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ పరిణామాల పట్ల థాక్రే కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఇలాంటి చిత్ర విచిత్రాలు ఏవైనా.. కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. పేరుకు పదవులేగానీ… అక్కడ ఎవరికి ఎవరూ బాధ్యులు కాదు. ఎవరి మాటా వినాల్సినపనిలేదు. వినకపోతే పట్టించుకుని యాక్షన్ తీసుకునే వాళ్ళు ఉండరన్న చర్చ పార్టీలో జరుగుతోంది. అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలో ఈ అవలక్షణాలేంటని నిట్టూర్చడం సగటు కాంగ్రెస్ అభిమాని వంతు అయింది.