Off The Record: తెలంగాణ శాసన మండలిలో ఆరు ఖాళీలు రాబోతున్నాయి. నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారం పది రోజుల్లో వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ సీట్లతో పాటు గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. రకరకాల సమీకరణలతో చాలా రోజుల నుంచి ఈ రెండు సీట్లను భర్తీ చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్లో పడ్డ ఆ రెండు స్థానాలు ఇప్పుడు కాంగ్రెస్ కోటాలోకి వెళ్ళిపోతాయి. ఆ పార్టీ సిఫారసు చేసే అభ్యర్థులు ఇద్దరు ఎమ్మెల్సీలు అవుతారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ నుంచి…. పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి గెలిచారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి విజయం సాధించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక, కడియం, కౌశిక్, కసిరెడ్డి, పల్లా తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న స్థానాలకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించే కేబినెట్ భేటీలో అభ్యర్థుల పేర్లు ఎంపిక చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. పల్లా ఖాళీ చేసే గ్రాడ్యుయేట్స్, కసిరెడ్డి ఖాళీ చేసే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవులకు నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతుండగా.. అసెంబ్లీలో సంఖ్యా బలం దృష్ట్యా ఒక సీటు కాంగ్రెస్కు, రెండో సీటు బీఆర్ఎస్కు దక్కనుంది. ఒకవేళ కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను పోటీకి దించితే ఎన్నిక అనివార్యం అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్, కమ్యూనిస్టులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పోరాటం చేశారు. సీపీఐ, టీజేఎస్తో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎన్నికల అవగాహన మేరకు సీపీఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాల్సి ఉంది.
ఈ పరిస్థితుల్లో గవర్నర్ కోటా మీదే అందరి దృష్టి ఉంది. ప్రొఫెసర్ కోదండ రామ్కు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ, ఫిరోజ్ఖాన్లో ఒకరికి ఇప్పుడు.. మరొకరికి తర్వాత ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వొచ్చంటున్నారు. సీపీఐకి ఇచ్చే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీటు గవర్నర్ కోటాలో కోరుతున్నారు. ఈ ఆరు తప్ప కౌన్సిల్లో 2025 మార్చిలోపు ఖాళీ అయ్యే సీట్లు లేవు. దీంతో ఎమ్మెల్సీ సీట్ల కోసం పట్టుబడుతున్న నేతలందరినీ సంతృప్తి పరచాల్సి ఉంది. అదే పార్టీ నాయకత్వానికి కత్తిమీద సానులా మారబోతోందంటున్నారు పరిశీలకులు.