Off The Record: గొడవలు, ఆధిపత్య పోరు, నేతల సూటిపోటి మాటలు, అసంతృప్తి ట్వీట్స్కు కేరాఫ్గా మారిపోతోంది తెలంగాణ బీజేపీ. రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమం సాక్షిగా … మరోసారి పార్టీలోని లుకలుకలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా నాయకులు ఇన్డైరెక్ట్గా, డైరెక్ట్గా వేసిన పంచ్లు, చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇది చూసిన వారంతా…. అబ్బో… తెలంగాణ బీజేపీలో చాలా గొప్ప ఐకమత్యం ఉందే… సూపర్…. అంటున్నారట. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. అయితే ఈసారి మాత్రం గతానికి భిన్నంగా జరిగిందట కార్యక్రమం. ప్రమాణ స్వీకార సభ మొదట్నుంచి చివరిదాకా హాట్ హాట్గా జరిగింది. నేతలు గతంలోలాగా లోలోపల ఏం దాచుకోకుండా… తమ మనసులో ఉన్న మాటలు ఓపెన్గానే చెప్పేశారట. ఆ క్రమంలో కొందరు పార్టీ లైన్ దాటారన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. అంతర్గత వేదికలపై మాట్లాడాల్సిన విషయాలను కూడా బహిరంగంగానే మాట్లాడి కాక పెంచారన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట.
మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ని ఆకాశానికెత్తేశారు కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. అదీ కూడా అలా ఇలా కాదు…భుజాల మీదెక్కించుకుని పైకెత్తి నెలబెట్టేశారంతే….. అంటున్నాయి పార్టీ వర్గాలు. బండి సంజయ్ని చూసి బాత్ రూంలోకి వెళ్లి ఏడ్చానని అన్నారు రాజగోపాల్రెడ్డి. అసలు సంజయ్ పదవి పోవడానికి రాజ్ గోపాల్ కూడా ఒక కారణమని ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో అయన చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఇక ఈడీని కూడా కేసీఆర్ మేనేజ్ చేశారన్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరో మాజీ మంత్రి రవీంద్ర నాయక్ కూడా ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేతలకు వేదిక మీద మైకిచ్చి మాట్లాడమంటే…. అసలు విషయానికి బదులు ఏవేవో మాట్లాడేసి లేని పోని వివాదాలు కొని తెచ్చారన్న అభిప్రాయం ఉందట పార్టీ పెద్దల్లో. ఇక బండి సంజయ్ మాటలపై ఇంటా బయటా రచ్చ అవుతోంది. తన మీద సొంత పార్టీలోనే కొందరు హైకమాండ్కు ఫిర్యాదులు చేశారని, అలాంటి పనులు మానుకోండని అన్నారాయన. దీంతో సంజయ్ ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలన్నారన్న అంశం ఆసక్తికరంగా మారింది. కనీసం కిషన్రెడ్డిని అయినా… స్వేచ్ఛగా పనిచేసుకోవ్వండని అన్న మాటలపై పార్టీలోని కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఇటీవలి పరిణామాలను ఉద్దేశించే ఆయన అలా అనిఉంటారని గుసగుసలాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు.
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కార్యక్రమానికి పిలవడంపై కూడా పార్టీలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోందట. పచ్చి సమైక్యవాది అయిన కిరణ్ను ఎలా పిలిచారంటూ కొందరు తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. విజయ శాంతి అయితే ఏకంగా ట్వీట్ ఏ చేశారు. ఆయన వచ్చినందుకే నేను మధ్యలో వెళ్లిపోయానంటూ రాములమ్మ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఈ పరిణాలన్నిటినీ చూస్తున్నవారు మాత్రం బీజేపీలో కూడా కాంగ్రెస్ కల్చర్ మొదలైందని అంటున్నారట. ఓ వైపు పార్టీ హై కమాండ్ సర్ది చెప్పే పని చేస్తుంటే… మరోవైపు ఎవరో ఒకరు గీత దాటి తల నొప్పి తెప్పిస్తున్నారన్నది ఇప్పుడు టీ బీజేపీలో ఉన్న అభిప్రాయం. ఈ లొల్లి ఇలానే కొనసాగితే ఎన్నికల్ని ఎదుర్కోవడం ఎలాగన్న ఆందోళన కేడర్లో పెరుగుతోందట.