బీసీ రిజర్వేషన్ల వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య హీట్ పెంచుతోంది. అధికార ప్రతిపక్ష లీడర్లు విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీ తో రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడారు. ఓట్ల కోసం బీజేపీ మత రాజకీయాలు చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఆ పార్టీకి ఇష్టం లేక, కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుంది. బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అధికారం కోసమే కవిత దీక్ష డ్రామా మొదలుపెట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండగా.. బీసీ రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కులగణన లో పాల్గొనలేదు.
వాళ్లకు బీసీ రిజర్వేషన్ల పై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం 33శాతం బీసీ రిజర్వేషన్లు 23 శాతానికి తగ్గించిందన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తే తప్పేముంది? బీఆర్ఎస్ అధికారంలో ఉండగా జార్ఖండ్, ఢిల్లీ, మహారాష్ట్ర కు ఏ సంబంధం ఉందని వెళ్లారు..? అని ప్రశ్నించారు. సీఎం ఢిల్లీ వెళ్లి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ లా ఫాం హౌస్ లో పడుకోలేదని ఎద్దేవ చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో ఆందోళనలు చేస్తామన్నారు. ఢిల్లీలో ఆందోళన అనంతరం కేంద్రం స్పందన ను బట్టి స్థానిక సంస్థల ఎన్నికల పై నిర్ణయం ఉంటుందని రాష్ట్ర మంత్రి సీతక్క స్పష్టం చేశారు.