Harish Rao: సీఎం కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఆసరా పెన్షన్ ఐదు వేలకు పెంచుతామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలోని నాల్సబ్ గడ్డలో బీఆర్ఎస్లో చేరికల కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలిస్తే రేషన్ షాపులో సన్న బియ్యం ఇస్తామన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాటలు చెబుతారు తప్ప పనులు చేయరని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రంలో కరెంట్ కోతలు, నీళ్ల సమస్యలు ఉన్నాయన్నారు. సంగారెడ్డి అభివృద్ధి బాధ్యత తనదని మంత్రి హామీ ఇచ్చారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మంత్రి హరీశ్ విజ్ఞప్తి చేశారు.
Also Read: Janareddy: కాంగ్రెస్ పార్టీని విమర్శించేస్థాయి కేటీఆర్, హరీష్, కవితలకు లేదు
అనంతరం సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగాకాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి నేనే సీఎం అంటారు.. జానారెడ్డి పోటీ చేయకున్నా సీఎం అవుతా అంటారు.. ఇంకెవరో కూడా సీఎం అంటారని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో ఎంత మంది సీఎంలు అంటూ మంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్లో సీఎం ఎవరంటే కేసీఆర్ అని చెబుతారు.. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం అభ్యర్థి పేరు చెబుతారా అంటూ మంత్రి హరీశ్ ప్రశ్నించారు.