మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలలో కోట్లలో అభిమానులు ఉన్నారు. దీంతో తమ అభిమాన నటుడికి జీవితంలో ఒక్కసారైనా కలవాలని వారు తపించిపోతుంటారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన గంగాధర్ అనే యువకుడు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. అయితే గంగాధర్ ఓ దివ్యాంగుడు. అయినా అభిమాన హీరోను చూడాలన్న ఆశను మాత్రం చంపుకోలేదు. ఈ నేపథ్యంలో తన ఆరాధ్య హీరో కోసం సాహసం చేశాడు. ఏకంగా అమలాపురం నుంచి పాదయాత్ర చేసి హైదరాబాదులోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్దకు చేరుకున్నాడు.
అమలాపురం నుంచి హైదరాబాద్ వరకు 23 రోజుల్లో గంగాధర్ 726 కిలోమీటర్ల మేర నడిచాడు. దీంతో గంగాధర్ పాదయాత్ర విషయం మెగాస్టార్ చిరంజీవి చెవిన పడింది. దివ్యాంగుడు తన పట్ల చూపించిన అభిమానానికి ఆయన కదిలిపోయారు. వెంటనే గంగాధర్ను తన ఇంటికి ఆహ్వానించారు. తనపై అభిమానాన్ని అతడి మాటల్లో విన్న చిరంజీవి ముగ్ధుడయ్యారు. అయితే తనకోసం అతడు వందల కిలోమీటర్లు నడిచి రావడం పట్ల మెగాస్టార్ బాధపడ్డారు. మరోసారి ఇలాంటివి చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. కాగా ఈ పాదయాత్ర ఎందుకు చేశావని చిరంజీవి అడగ్గా… ‘మాస్టర్’ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర చేపట్టినట్టు గంగాధర్ వివరించాడు.
Read Also: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్