Pawan Kalyan: ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే సీఎం జగన్, చంద్రబాబు, పవన్ తమ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కూటమిగా మూడు పార్టీలు బరిలో నిలవగా, కాంగ్రెస్తో కలిసి వామపక్షాలు మరో కూటమిగా పోటీ చేస్తున్నాయి. వైసీపీ సింగిల్ గా ఎన్నికల్లో తల పడుతోంది. కూటమిలో సీట్ల ప్రకటన దాదాపు పూర్తయింది. ఈ క్రమంలోనే పార్టీల కీలక నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తూ ఎన్నికల ప్రచార బరిలో ముందుకు సాగుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ కూటమి కార్యకర్తలను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.
Read Also: Chandrababu: మార్కాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఈ 40 రోజులు చాలా కీలకమని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పనిచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు సూచించారు. ఎన్డీఏ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ దిశానిర్ధేశం చేశారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలు సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచనలు చేశారు. పోలింగ్ ముగిసేంతవరకు క్షేత్రస్థాయిలో మూడు పార్టీల కార్యకర్తలు కలిసి పని చేయాలన్నారు. పిఠాపురంలో మన విజయం తథ్యమని.. చరిత్రలో నిలిచిపోయేలా పిఠాపురం గెలుపు ఉండాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దేశంలోనే పిఠాపురం ఒక రోల్ మోడల్ నియోజకవర్గం అవుతుందన్నారు. వర్మ త్యాగం చాలా గొప్పది.. ఆయన ఉన్నత స్థానంలో ఉండేలా తాను ప్రయత్నం చేస్తాను జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.