ఆసియా కప్ 2025లో భాగంగా గ్రూప్ స్టేజ్లో భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఘోర ఓటమిని ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత కరచాలనం వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరచాలనం విషయంలో మ్యాచ్ రిఫరీపై ఏసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. అయితే ఐసీసీ మాత్రం పీసీబీ ఫిర్యాదును పక్కనపెట్టింది. సూపర్-4లో ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. చిరకాల పోరు ఆలోచనే తమకు లేదని చెప్పాడు. ఈ మ్యాచ్ కేవలం ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమే అని పేర్కొన్నాడు. దీంతో పాక్ మ్యాచ్ను భారత్ తక్కువగా చూస్తోందని ఆ దేశ మాజీలు వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ మాజీల వ్యాఖ్యలను టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిప్పి కొట్టాడు. పాక్తో మ్యాచ్ను తాము ఎక్కడా తక్కువగా చూడలేదని, వాస్తవ పరిస్థితులను భారత్ చెప్పిందన్నాడు. ‘భారత్, పాకిస్థాన్ పోరుకు ఉన్న హైప్ను టీమిండియా ఎక్కడా తక్కువ చేయలేదు. కేవలం ప్రస్తుతం వాస్తవ పరిస్థితులను వెల్లడించింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత క్రికెటర్ల మనోభావాలను చెప్పాడు. సమస్యంతా పాకిస్థాన్ జట్టుదే. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్పై ఆందోళన వ్యక్తం చేయడం సరికాదు. నిజం చెప్పాలంటే అతడు పాక్ జట్టును రక్షించాడనే చెప్పాలి. పాక్ మ్యాచ్ ఓడినా మాజీలు, అభిమానుల నుంచి విమర్శలు రాలేదు. దృష్టంతా పైక్రాఫ్ట్ వైపు మళ్లింది’ అని యాష్ చెప్పాడు.
Also Read: Xiaomi Diwali Sale 2025: షావోమీ దీపావళి సేల్.. ఫోన్లు, స్మార్ట్ టీవీలపై 60 శతం తగ్గింపు!
‘కరచాలనం విషయంలో భారత జట్టు ముందే మ్యాచ్ రిఫరీకి తమ నిర్ణయం ఏంటో చెప్పింది. అంతా జరిగిన తర్వాత పాకిస్థాన్ మ్యాచ్ ఓడిపోయింది. అయినా విమర్శలు రాలేదు. బలవంతంగా ఆటగాళ్లతో కరచాలనం చేయించడానికి రిఫరీ ఏమీ స్కూల్ టీచర్ కాదు, ప్రిన్సిపల్ కూడా కాదు. సూర్యకుమార్ యాదవ్ వద్దకు వెళ్లి పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయమని రిఫరీ చెప్పలేడు. ఎందుకంటే అది అతడి బాధ్యత కాదు. అందుకే పైక్రాఫ్ట్ తప్పేమీ లేదు. అనవసరంగా పాక్ రాద్ధాంతం చేస్తోంది’ అని అనవసరంగా పాక్ మాజీలు రాద్ధాంతం చేస్తున్నారని వివరించాడు.