Shraddha Walker Case: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసులో రోజుకొక విషయం వెలుగుచూస్తోంది. శ్రద్దా వాకర్ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా 35 ముక్కలుగా నరికి హత్య చేశాడు. ఆమె శరీర భాగాలను ఢిల్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేశాడు. మరోవైపు, తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని శ్రద్ధ ముందుగానే ఊహించింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్న సమయంలో రెండేళ్ల క్రితమే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడు ఆమెను అఫ్తాబ్ కొట్టాడు. ఆమెకు ఊపిరాడకుండా చేసి, హత్య చేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో ఆమె మహారాష్ట్రలోని వసాయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 2020లో శ్రద్ధా వాకర్ ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తనను చంపి ముక్కలుగా నరికివేస్తానని బెదిరించాడని అందులో పేర్కొంది. మహారాష్ట్రలోని పాల్ఘర్లోని తులిన్జ్ పోలీస్ స్టేషన్లో హత్య కేసులో ప్రధాన నిందితుడైన తన ప్రియుడు తనపై దాడి చేసి చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదు చేసింది.
ఈ ఏడాది మేలో శ్రద్ధా (27)ని ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా గొంతు కోసి హత్య చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అఫ్తాబ్ ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, తరిగిన భాగాలను ఫ్రిజ్లో భద్రపరిచి, ఆపై వాటిని చాలా రోజుల పాటు దేశ రాజధాని సమీపంలో అటవీప్రాంతంలో పడేశాడు. ఈ జంట 2019లో డేటింగ్ యాప్లో కలుసుకున్నారు. ముంబైలో నుంచి దక్షిణ ఢిల్లీలోని ఛతర్పూర్కు ఒక ఇంటిలో కలిసి ఉన్నారు. 2020లో తులింజ్ పోలీస్ స్టేషన్లో శ్రద్ధ ఫిర్యాదు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు ధృవీకరించారు.
Jerusalem Blasts: జంట పేలుళ్లతో వణికిన ఇజ్రాయిల్.. జెరూసలేంపై మిలిటెంట్ల దాడి..
నవంబర్ 23, 2020 నాటి తన ఫిర్యాదు లేఖలో శ్రద్ధా ఇలా రాసింది. “ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా నన్ను దుర్భాషలాడుతూ కొట్టాడు, ఈ రోజు అతను నన్ను ఊపిరాడకుండా చంపడానికి ప్రయత్నించాడు. అతను నన్ను చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. ముక్కలుగా నరికి పారేస్తానని బెదిరించాడు. అతడు నన్ను చంపేస్తాడని బెదిరించడంతో పోలీసుల వద్దకు వెళ్లే ధైర్యం నాకు లేదు.” అని శ్రద్ధ లేఖలో పేర్కొంది. అఫ్తాబ్ తనను కొట్టేవాడని, చంపేందుకు ప్రయత్నించాడని అతడి కుటుంబసభ్యులకు తెలిసిందని శ్రద్ధా లేఖలో పేర్కొంది. అతడి కుటుంబసభ్యులు ఉన్నారనే ధైర్యంతో తనతో ఉన్నానని.. కానీ వారికి తెలిసే తనను బాధపెట్టినట్లు ఆమె లేఖలో తెలిపింది. తనతో కలిసి ఉండాలని లేదని కూడా ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అయినప్పటికీ… మళ్లీ అతనితోనే ఆమె ఎందుకు ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.