మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లోని పీవీ జ్ఞానభూమి వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానిగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశం కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు అని అన్నారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ.. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు అని ఆయన చెప్పారు. బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు.. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని పీవీ చెప్పారనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
Read Also: Congress Manifesto: 2024 ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా పి. చిదంబరం
భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు.. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం.. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారు.. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.