తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రాన్ని విడుదల చేసి ప్రసంగించారు. 42 పేజీల శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలని తమ లక్ష్యమన్నారు. బడ్జెట్లను కొలమానంగా తీసుకున్నాం.. రెవెన్యూ ఎక్స్ పెండెచర్ విషయంలో కాగ్ ని పరిగణలోకి తీసుకున్నామన్నారు. లోన్ల విషయంలో ఆర్బీఐని పరిగణలోకి తీసుకున్నాం.. ఉద్యోగుల అంశంలో కాగ్ ని పరిగణలోకి తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదాయం, అవసరాల పై ఆర్బీఐ నిత్యం వివరాలు అందిస్తుందన్నారు.
మరోవైపు.. హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 35 రోజులు మాత్రమే మిగులు నిధులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చినప్పుడు 303 రోజులు ఆర్బీఐ దగ్గర మిగులు నిధులు ఉండేవన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకా ఐదేళ్లలో సగం రోజులో కూడా డబ్బులు లేవని ఆరోపించారు. రోజు ఆర్బీఐ దగ్గర జీతాలకు డబ్బులు ఇవ్వండి అని ఆడుకునే పరిస్థితి తెచ్చారు గత పాలకులు అని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంక్ లో అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందని సీఎం తెలిపారు. తప్పును తప్పుగా చెప్పకపోతే మనం కూడా తప్పులో భాగస్వామ్యం అయినట్టేనని పేర్కొన్నారు.
Big Shock: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి భారీ షాక్..
శ్వేత పత్రం ఎవరినో నిందించడానికి పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లు గొప్పగా చేశాం అంటున్నారు కాబట్టి.. అసలు విషయాలు చెప్పడానికి శ్వేతపత్రం అని తెలిపారు. ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. నివేదికలో ఎవరిని కూడా నిందించలేదు.. హరీష్ రావు పక్క రాష్ట్రం అధికారితో రాయించారు అంటున్నాడు.. ఇదా పద్దతి అని సీఎం ప్రశ్నించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి కూర్చొని రాసిందే.. మీలాగా మేము చేయమని బీఆర్ఎస్ నేతలపై దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే హరీష్ రావు, వైఎస్ కలిసిన ఫోటో చూపించారు రేవంత్. ఇద్దరి మధ్య చర్చ ఏం జరిగిందో ఇప్పటికి తెలియదు.. నాతో ఎవరైనా కలిస్తే తప్పా అని అన్నారు. కిషన్ రెడ్డితో సహకారం ఉండాలని ఫోన్ చేసి మాట్లాడా.. రాజకీయాలు కోసం కాదన్నారు.
ఇదిలా ఉంటే.. ప్రజలను సెక్రటేరియట్ కి పిలిచాం.. ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చామని సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ లో సమస్యలపై.. ఎంఐఎం లను పిలిచి మాట్లాడామన్నారు. రాజకీయాలు వేరు.. కానీ హైదరాబాద్ ఇమేజ్ కాపాడాలి.. అందుకు అందరితో మాట్లాడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం కోసం ఇందిరా, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారు.. సోనియా, రాహుల్ గాంధీ పదవి త్యాగం చేశారన్నారు. ఖర్గే అధ్యక్షతన అభివృద్ది కోసం పని చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందరితో మాట్లాడతాం.. సీపీఎం, న్యూ డెమోక్రసి లాంటి వాళ్ళను కూడా కలిసి మాట్లాడతామని సీఎం తెలిపారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం.. ఏక వ్యక్తి నిర్ణయాలు ఉండవు.. అందరి అభిప్రాయం తీసుకుని చట్టాలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.