NTV Telugu Site icon

CM Revanth Reddy: నల్లమలలో పెరిగిన పులులు, తోడేళ్లు చూశా.. మీ కుట్రలు ఎంత?

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్రపట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. రుణమాఫీపై చర్చకు కేసీఆర్‌, మోడీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఉందా అంటూ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది అని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

Read Also: CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటాలను దక్కించుకోవాలి.. సీఎం ఆదేశం

అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం, సాగర్‌ కట్టేవాళ్లా అంటూ చెప్పుకొచ్చారు. విపక్షాల ఉచ్చులో పడొద్దన్నారు. కుటుంబాలను నాశనం చేసుకోవద్దన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ పరిశ్రమలు అడ్డుకుని ఫాంహౌస్‌కు పోతారని విమర్శించారు. రైతు కష్టం నాకు తెలియదా అంటూ పేర్కొన్నారు. కొడంగల్‌లో పారిశ్రామిక పార్కులు నిర్మించి ఉద్యోగాలు తేవాలని తాను అనుకున్నానన్నారు. కానీ, లగచర్లలో గొడవ చేసి మంట పెట్టారన్నారు. బీఆర్ఎస్‌ మాయమాటలు నమ్మి గిరిజనులు జైళ్లకు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. కుట్రలు, కుతంత్రాలు సాగనివ్వను.. కొడంగల్‌లో పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 25 వేల ఉద్యోగాలు తీసుకొస్తామన్నారు. నల్లమలలో పుట్టి పెరిగా.. మీ లాంటి గుంట నక్కలకు భయపడనన్నారు. పాలమూరు వాళ్లకు పని చేయడమే తెలుసు.. గొప్పలు చెప్పుకోరన్నారు. రైతులే మా బ్రాండ్‌ అంబాసిడర్లు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: Telangana: పంట రుణమాఫీ నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

వరి వేస్తే ఉరి కేసీఆర్‌ అన్నాడని.. ఇప్పుడూ వరి వేస్తే ఇప్పుడు బోనస్ ఇస్తున్నామన్నారు. వరి వేస్తే బోనస్ ఇస్తుంటే.. మూడు రోజుల్లో డబ్బులు పడుతుంటే బీఆర్‌ఎస్ గుండెల్లో పిడుగులు పడుతున్నాయన్నారు. ఐదేళ్లలో మొదటి ఏడాదిలో మాఫీ చేయకపోవడంతో మీరు చేసిన మాఫీ వడ్డీకే మిగిలిందని విమర్శించారు. ఒక్క రోజే 18 వేల కోట్లు రైతులకు మాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కాళేశ్వరం కడిగితే లక్ష 20 వేల కోట్లు పెట్టారని.. కాళేశ్వరం కుప్పకూలిందని సీఎం విమర్శించారు. మేము కట్టిన నాగార్జున సాగర్.. ఎల్లంపల్లి ఎట్లా ఉన్నాయి చూడాలన్నారు. మంత్రులపై సీఎం సెటైర్లు వేశారు. ఉత్తమ్ పాలమూరు అల్లుడు.. అల్లుడిగా రుణం తీర్చుకోవాలి అని రేవంత్ అన్నారు. మల్లు వారిది పాలమూరే.. 100 ఖర్చు ఐతే 50 రాసుకుంటం.. విరివిగా నిధులు ఇవ్వండి అంటూ భట్టికి విజ్ఞప్తి చేశారు. దామోదర రాజనర్సింహ.. చెప్పింది కాదని అనడు.. అందుకే ఇంచార్జి మంత్రిగా పెట్టుకున్నా అని చెప్పారు.