నేడు సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి.. 10.40కి విశాఖ చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బీచ్ రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి పార్కు హోటల్ వరకూ అంతర్జాతీయ యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను సీఎం పరిశీలిస్తారు. అనంతరం 11.45 గంటలకు బయలుదేరి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుని యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.05 నోవాటెల్ హోటల్కు వెళ్లి.. అధికారులతో యోగా దినోత్సవంపై సమీక్షిస్తారు.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు నోవాటెల్ హోటల్లో బయలుదేరి.. 2.50 గంటలకు పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్స్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలతో సమావేశమై యోగా వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళతారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పార్థసారథితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు ఆదివారమే వైజాగ్ చేరుకున్నారు.