పాకిస్థాన్ దేశంలో దారుణం చోటు చేసుకుంది. ఇవాళ (శుక్రవారం) వాయువ్య పాకిస్తాన్లోని కొండ ప్రాంతం నుంచి ప్రయాణీకులతో కూడిన బస్సు లోయలో జారిపడటంతో దాదాపు 20 మంది వరకు మరణించారు. గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలోని డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. బస్సు రావల్పిండి నుంచి హుంజా వెళ్తున్న క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.. దీంతో ఒక్కసారిగా లోయలో పడిపోయింది.
Read Also: Harish Rao: కాంగ్రెస్ వచ్చాక బంగారం, నిత్యవసర ధరలు పెరిగాయి..
ఇక, బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే విషయంపై స్పష్టత లేదని స్థానిక అధికారి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన 15 మందిని చిలాస్లోని ఆసుపత్రికి తరలించాం.. అలాగే, మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Read Also: Noida : డాగ్ లవర్స్ తాట తీసిన.. నోయిడా జనాలు.. స్టేషన్లో రచ్చ రచ్చ
కాగా, ఈ ఘటనపై గిల్గిత్ బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి హాజీ గుల్బర్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని పరిపాలన శాఖ అధికారులను ఆదేశించారు. ప్రమాదం తర్వాత చిలాస్ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించామని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరక్ చెప్పుకొచ్చారు.