తెలంగాణ దేశానికి మోడల్ అట…. దేనికి మోడల్ కేసీఆర్ ? రైతుల ఆత్మహత్యల్లోనా…. ఫ్రీ యూరియా, రుణమాఫీ, విత్తనాల పేరుతో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పడంలోనా…..? రైతు బంధు పేరుతో అన్ని సబ్సిడీలు బంద్ చేయడంలోనా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ది కిసాన్ సర్కార్ కాదని…తెలంగాణ ప్రజలను, నిరుద్యోగుల కొంపలు ముంచే సర్కార్ అని మండిపడ్డారు. ఢిల్లీ దొంగ సారా దందాలో సుఖేష్ చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీకి రూ.75 కోట్లు ఇచ్చిన విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో ఆ చర్చను దారి మళ్లించేందుకు మహారాష్ట్ర రైతుల జాయిన్సింగ్స్ పేరుతో డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కు చెందిన బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కార్యదర్శి బొమ్మ జయశ్రీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగాయపల్లి గోపీ, పాదయాత్ర సహ ప్రముఖ్ లంకల దీపక్ రెడ్డి తదితరులతో కలిసి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సంజయ్ సమాధానమిచ్చారు.
అంతేకాకుండా.. ‘షర్మిల నాకు ఫోన్ చేసి మాట్లాడిన మాట వాస్తవం. ఆమెకు అన్యాయం జరిగినప్పుడు ఖండించానని చెప్పిన మాట నిజం. భవిష్యత్తులో ఎవరికి అన్యాయం జరిగినా కేసీఆర్ అరాచకాలపై పోరాడతామని చెప్పిన. అయితే కాంగ్రెస్ కలిసి పనిచేయబోమని కూడా స్పష్టం చేశాను. ఎందుకంటే కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని వాళ్ల నాయకులే చెబుతున్నారు. జానారెడ్డి కూడా ఇదే చెప్పారు. ఎన్నికలకు ముందు కొట్లాడినట్లు కన్పించినా…ఎన్నికల తరువాత కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అలాంటి పార్టీతో ఎట్లా కలిసి పనిచేస్తాం?బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఏ పార్టీతో కలిసి పనిచేయాలనే అంశంపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
Also Read : Colleges Reopen : జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం ఎప్పుడంటే..?
సీఎం కేసీఆర్ ది కొంపలు ముంచే బుద్ది. దేశంలో తెలంగాణ దేనికి మోడల్? రైతుల ఆత్మహత్యల్లోనా? ధనిక రాష్ట్రాన్ని అప్పలు పాల్జేయడంలోనా? ఫస్ట్ నాడు జీతాలు కూడా ఇయ్యకపోవడంలోనా? దేనికి మోడల్… రైతు అప్పుల్లో అగ్రగామి తెలంగాణ.. రైతు బంధు పేరుతో అన్ని సబ్సిడీలు బంద్ చేయడంలో మోడల్ ? ఫ్రీ యూరియా, విత్తనాలు, రుణమాఫీ హామీలిచ్చి మోసం చేయడంలో మోడల్…
సుఖేష్ చంద్రశేఖర్ అంశం తెరపైకి రావడంతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై చర్చ జరగకుండా దారి మళ్లించడానికే మహారాష్ట్ర రైతుల జాయినింగ్స్ పేరుతో మీడియాలో చర్చ జరగాలని చూస్తున్నరు. కేసీఆర్ ఎవరినీ వదిలపెట్టడం లేదు. ఆ కుటుంబం కూడా అంతే… దొంగ దందా, లంగా దందా, లిక్కర్ దందా చేసేటోళ్ల దగ్గర కూడా పైసలు తీసుకుంటున్నరు.
బీఆర్ఎస్ ఆఫీస్ కు వచ్చి డబ్బులిచ్చిపోయినట్లు సుఖేష్ చెప్పిండు. వెహికల్ నెంబర్ కూడా చెప్పారు. రేపో మాపో ఆయనపై ఒత్తిడి తెచ్చి మాట మార్చేలా చేసినా ఆశ్చర్యం లేదు.
మహారాష్ట్ర రైతులను తెలంగాణలో తిప్పుతాడట…. అట్లాగే… రుణమాఫీ చేస్తానని మాట తప్పిన విషయాన్ని, సబ్సిడీలు బంద్ చేసిన విషయాన్ని, ఫ్రీ యూరియా హామీలను మర్చిన విషయాన్ని చెప్పు. కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు కూడా అదనపు నీళ్లు రావడం లేదని, వడ్ల కొనుగోలులో జరిగిన మోసాలను చెబితే ఆ రైతులకు చెబితే బాగుండేది.
టీఎస్పీఎస్సీ కమిషన్ ను పూర్తిగా రద్దు చేయాలే. వాళ్లను తొలగించడానికి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి కేసీఆర్ కున్న ఇబ్బంది ఏమిటి? కేసీఆర్ కొడుకేమో ఇద్దరి తప్పిదంవల్లే లీకేజీ అన్నడు కదా… మరి ఇయాళ్టి వరకు 15 మందిని అరెస్ట్ చేశారు. 104 మందిని విచారించారు. తప్పుదోవ పట్టించిన కేసీఆర్ కొడుకును ఎందుకు బర్తరఫ్ చేయలే. ఎందుకు విచారించలేదు?
కేసీఆర్ కొడుకు లీకేజీలో ఐటీ శాఖకు సంబంధం లేదంటాడు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినా, కుక్క కరిచి, నాలాలో పడి పిల్లలు చనిపోయినా నాకేం సంబంధం అంటున్నడు… పైసలు దండుకోవడం తప్ప ఆయనకు దేంతోనూ సంబంధం ఉండదేమో…
పేపర్ లీకేజీలో బీఆర్ఎస్ కు చెందిన పెద్ద మనుషుల పాత్ర ఉంది. వాళ్లను కాపాడుకోవడానికి చిన్న వాళ్లను అరెస్ట్ చేసి కేసును క్లోజ్ చేయాలని కుట్ర చేస్తున్నరు. ఒకవైపు టీఎస్పీఎస్సీ కార్యదర్శి, సభ్యులకు నోటీసులిచ్చి విచారణ చేస్తూనే… మరోవైపు వాళ్ల ఆధ్వర్యంలోనే పరీక్షలు ఎట్లా నిర్వహిస్తారు? దొంగ చేతికి తాళాలివ్వడం కాదా? తక్షణమే కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాలి. విచారణ జరపాలి. 30 లక్షల మంది జీవితాలు అంధకారమవుతుంటే సీఎం ఎందుకు స్పందించడం లేదు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు… 30 లక్షల మంది జీవితాలను, తెలంగాణ ప్రజల కొంపలు ముంచే సర్కార్ నీది.
బిడ్డ లిక్కర్ దందా గురించి కేసీఆర్ నోరు విప్పడు. బిడ్డను కాపాడుకునేందుకు ప్రభుత్వ అదనపు ఏజీని ఈడీ దగ్గరకు పంపుతాడే తప్ప 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలనే తపనే లేకుండా రాక్షసుడిగా మాట్లాడుతున్నడు. ప్రధానిని బ్రోకర్ అని ట్విట్టర్ టిల్లు అంటున్నడు…. మరి నేను అనేనా? సీఎం పాస్ పోర్ట్ బ్రోకర్ …అని ? ఆ మాట ప్రజలే అంటున్నరు. దొంగ సారా దందా చేస్తున్నారని కూడా ప్రజలంటున్నరు. దొంగ పాస్ పోర్టుల దందా చేస్తున్నారని సాక్షాత్తు ఎమ్మెస్సార్ అన్నడు.. పేపర్ లీకేజీ విషయంలో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పేపర్ లీకేజీలో కొడుకును కాపాడుకునేందుకు, దొంగ సారా దందాలో బిడ్డను కాపాడుకునేందుకు బెంగాల్ తరహాలో పాలన చేయాలనుకుంటున్నడు. కేసీఆర్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ వారసుడు… బీజేపీ కార్యకర్తలను బెదిరించి జైళ్లకు పంపుతున్నడు. రెండ్రోజుల క్రితమే సీఎం పోలీసులకు ఆదేశించినట్లు సమాచారం. నిరుద్యోగుల కోసం, ప్రజల కోసం ఎంతవరకైనా త్యాగం చేసేందుకైనా బీజేపీ కార్యకర్తలు సిద్ధమైనరు.
బీఆర్ఎసోళ్లు గోడల మీద ఉన్నరు… మేం ప్రజల గుండెల్లో ఉన్నారు… పేద ప్రజలు ఎవరు డబ్బులిస్తే వాళ్ల పోస్టర్లు, ఫ్లెక్సీలు అంటిస్తారు.. వాళ్లను అరెస్ట్ చేస్తున్న పోలీసులు నాపైనా, బీజేపీపైన సాక్షాత్తు ప్రధానిని కించపర్చరేలా పోస్టర్లు వేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోరు? ఇదేమని ప్రశ్నించిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుకునేందుకు కొందరు పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. వాళ్లు ఉద్యోగం పర్మినెంట్ అనుకుంటున్నారు. జనం తిరగబడే రోజులొచ్చినయ్. ప్రభుత్వం పతనం పతాక స్థాయికి చేరింది.
దమ్ముంటే పోలీస్ బందోబస్తు లేకుండా కేసీఆర్ ను, మంత్రులను ప్రజల్లోకి తిరగమని చెప్పండి.. ప్రజలు తిరగబడతారు.. తెలంగాణ దేనికి మోడల్ గా ఉంది? రైతుల ఆత్మహత్యల్లోనా? ధనిక రాష్ట్రం అప్పుల పాల్జేయడంలోనా? ఫస్టనాడు కూడా జీతాలు సక్రమంగా ఇయ్యకపోవడంలోనా? బీసీల పొట్టకొట్టిన విషయంలోనా, రుణమాఫీ చేయకపోవడంలోనా? ఏ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించకపోవడంలోనా? నిరుద్యోగ భ్రుతి ఇవ్వకపోవడంలోనా? కాంగ్రెస్-బీఆర్ఎస్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ఖాయం.. వాళ్లతోపాటు సూది దబ్బడం పార్టీలు కలిసే పోటీ చేస్తాయి. బీజేపీ మాత్రం సింగిల్ గా పోటీ చేస్తాం. రజకార్ల రాజ్యాన్ని అంతమొందిస్తాం. రామరాజ్యం స్థాపిస్తాం… ఏ సర్వేలు చూసినా చివరకు కేసీఆర్ చేయించుకున్న సర్వేల్లోనూ ఇవే ఫలితాలొస్తున్నాయి.