బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తన కెరీర్లో ఎదుర్కొన్న ఒక భయంకరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ షోలో ముచ్చటిస్తూ, ఆవేశంలో తాను చేసిన ఒక అతిపెద్ద తప్పు గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. కొన్ని ఏళ్ల క్రితం ఒక పార్టీలో తన సన్నిహిత మిత్రుడిని ఒక వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించాడని, పదే పదే హెచ్చరించినా వినకుండా తన స్నేహితుడిని ఏడిపించడంతో ఆవేశం ఆపుకోలేక ఆ వ్యక్తిని గట్టిగా కొట్టినట్లు అక్షయ్ తెలిపారు. ఆ దెబ్బకు ఆ వ్యక్తి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో తన గుండె ఆగినంత పనైందని అక్షయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Irumudi : మాస్ రాజా సరసన ప్రియా భవానీ శంకర్.. ‘ఇరుముడి’ ఫస్ట్ లుక్ చూశారా?
ఆ క్షణంలో తన కెరీర్ ముగిసిపోయిందని, ఇక తన భవిష్యత్తు శూన్యమని తీవ్ర భయాందోళనకు గురైనట్లు అక్షయ్ వివరించారు. “చుట్టూ చాలా మంది ఉన్నారు, అతడు పడిపోవడంతో నా జీవితం నాశనమైందని వణికిపోయాను. వెంటనే అతడి మొహంపై నీళ్లు చల్లుతూ.. భగవంతుడా అతడికి స్పృహ వచ్చేలా చూడు అని మొక్కుకున్నాను” అని ఆనాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ ఆ రోజు చేసిన పనిని ఇప్పటికీ ఒక పెద్ద తప్పుగా భావిస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం అక్షయ్ ‘భూత్ బంగ్లా’, ‘వెల్కమ్ టు ది జంగిల్’ వంటి చిత్రాలతో బిజీగా ఉండటమే కాకుండా, బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు.