హైదరాబాదులోని జలసౌధలో రేపు ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరుగనుంది. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ, తెలంగాణా రాష్ట్రాల అభిప్రాయాలు, అభ్యంతరాలపై సమావేశంలో చర్చించనున్నారు. కేఆర్ఎంబీ పరిధి, సిబ్బంది కేటాయింపు, ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి విశాఖ తరలింపు అంశాలపై సమావేశంలో చర్చ జరుగనుంది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పది కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలని ఇప్పటికే స్పష్టం చేసింది కేంద్రం. అయితే.. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి కేటాయింపులు, వాటాలపై రేపటి సమావేశంలో బోర్డులు చర్చించనున్నాయి. ఇక రేపటి సమావేశానికి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరు కానున్నట్లు సమాచారం అందుతోంది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ పై ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయనున్నారు.