Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంది. రెండు దేశాలు కూడా యుద్ధానికి సిద్ధమయ్యేందుకు అవసరమైన మిలిటరీ ఎక్సర్సైజులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఉగ్రవాద దాడిపై పలు దేశాలు స్పందించాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు భారతదేశానికి మద్దతు పలికాయి. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, ఈ విషయంలో భారత్కి తాము మద్దతు తెలుపుతామని చెప్పాయి.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ కూడా తన మిత్రులను కలుసుకుంటోంది. ప్రస్తుతం పాకిస్తాన్కి టర్కీ, చైనా, మలేషియా, అజర్ బైజార్ మంచి మిత్రులుగా ఉన్నాయి. తాజాగా, వస్తున్న సమాచారం ప్రకారం, టర్కీ పాకిస్తాన్కి ఈ వివాదంలో సాయం చేయలేమని ప్రకటించినట్లు సమాచారం. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ, పాకిస్తాన్కి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పంపినట్లు వార్తలు వచ్చాయి. సైనిక పరికరాలను ఇచ్చేందుకు టర్కీష్ C-130E హెర్క్యులస్ కరాచీలో దిగిందని నివేదికలు తెలిపాయి. దాదాపుగా ఆరు C-130E విమానాలు పాకిస్తాన్లో దిగాయని పలు మీడియా సంస్థలు పెర్కొన్నాయి.
Read Also: Jogulamba Gadwal: ఘోర ప్రమాదం.. నర్సింగ్ విద్యార్థులను డీకొన్న బోలెరో వాహనం.. ఇద్దరు మృతి
అయితే, ఈ వాదనల్ని టర్కీ తిరస్కరించింది. టర్కీ నుంచి వచ్చిన కార్గో విమానం కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే పాకిస్తాన్లో దిగిందని ప్రెసిడెన్సీ కమ్యూనికేషన్స్ డైరెక్టరేట్ చెప్పిందని టర్కియే టుడే నివేదిక తెలిపింది. టర్కీ పాకిస్తాన్కు ఆయుధాలతో కూడిన విమానాలను పంపినట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని టర్కిష్ అధికారులు సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.
పాకిస్తాన్కి టర్కీ దీర్ఘకాలిక మిత్రుడుగా ఉంది. ఇరు దేశాలు కూడా వ్యూహాత్మక సంబంధాలను పెట్టుకున్నాయి. పలు సందర్భాల్లో కాశ్మీర్ విషయంలో టర్కీ, పాకిస్తాన్కి వంతపాడింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ పలు వేదికలపై కాశ్మీర్ విషయాన్ని ప్రస్తావించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. కాశ్మీర్ భారత్లోని అవిభజిత అంతర్భాగమని స్పష్టం చేసింది.