ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఐఐఐటీ మొదటి సంవత్సరం విద్యార్థి రాహుల్ శనివారం రాత్రి హాస్టల్ క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. ప్రయాగ్రాజ్లోని ఝల్వా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. విద్యార్థి దివ్యాంగుడని పేర్కొన్నారు. 21వ పుట్టినరోజు జరుపుకోవడానికి ఒక రోజు ముందు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. సంఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని.. పరీక్షలో విఫలం చెందడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా దర్యాప్తులో తేలిందన్నారు. శనివారం రాత్రి 11:55 నిమిషాలకు ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడని.. పోలీసులు చేరుకునేలోపే చనిపోయాడని ధూమంగంజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) అజేంద్ర యాదవ్ తెలిపారు. ఇక దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేశామని.. 7 రోజుల్లో నివేదిక అందజేయాలని ఇనిస్టిట్యూట్ ఆదేశించింది.
కుమారుడు రాహుల్ మరణవార్త తెలియగానే ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ నుంచి తల్లిదండ్రులు ప్రయాగ్రాజ్కు వెళ్లారు. అయితే ఆత్మహత్యకు ముందు రాహుల్.. తల్లి స్వర్ణలతకు మెసేజ్ పెట్టాడు. తమ్ముడిని, డాడీని జాగ్రత్తగా చూసుకోవాలని సందేశం పంపించినట్లు స్వర్ణలత తెలిపింది. మెసేజ్కు భయపడి వెంటనే ఫోన్ చేశానని.. కానీ ఆఫ్లో ఉందని.. వెంటనే స్నేహితుడికి ఫోన్ చేస్తే.. తెలుసుకోవడానికి వెళ్లాడని అకస్మాత్తుగా కాల్ డిస్కనెక్ట్ అయినట్లు తెలిపింది. 10 నిమిషాల తర్వాత కాల్ చేస్తే ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పారని.. తీరా ఇక్కడి రాగానే చనిపోయినట్లు వార్త చెప్పారని స్వర్ణలత భోరున విలపించింది. కుమారుడు 6 నెలల నుంచి క్లాసులకు రావడం లేదని ఇన్స్టిట్యూట్ వాళ్లు చెప్పారని.. ఈ విషయం ముందుగానే ఎందుకు చెప్పలేదని స్వర్ణలత నిలదీశారు.