Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. భారత్లో నిరుద్యోగం పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా ఎక్కువగా ఉందని, భూటాన్ కన్నా వెనకబడి ఉన్నామని రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారాలన్నింటికీ తీవ్ర విఘాతం కలిగిందని ఆయన దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత 40 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగిత రేటు చేరుకుందని, పాకిస్తాన్తో పోలిస్తే భారత్లో రెండింతల నిరుద్యోగిత ఉందని అన్నారు.
Read Also: Pakistan: సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని పాకిస్తాన్ తీర్మానం..
ఆర్థిక అసమానతలు, యువత, రైతుల పరిస్థితిని గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించారు. జీఎస్టీ, నోట్ల రద్దు నిరుద్యోగ పెరుగుదలకు కారణమని అన్నాడు. కేంద్ర ప్రభుత్వం రైతుల కంటే పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతుల రుణమాఫీని విస్మరిస్తూ, కొందరు పారిశ్రామికవేత్తలకు భారీ రుణమాఫీని ఇవ్వడాన్ని విమర్శించారు. ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం.. 2022-23 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వార్షిక నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ నిరుద్యోగిత రేటు 8.5 శాతం కాగా.. భారత నిరుద్యోగిత రేటు 3.2 శాతంగా నమోదైంది.
లోక్సభ ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ని ప్రారంభించింది. మణిపూర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఈశాన్య రాష్ట్రాలను చుడుతూ బెంగాల్, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ మీదుగా ముంబైలో పూర్తి కాననుంది. శనివారం మధ్యాహ్నం మొరెనా జిల్లా మీదుగా మధ్యప్రదేశ్లోకి యాత్ర ప్రవేశించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల మీదుగా యాత్ర సాగుతుంది. 15 రాష్ట్రాల్లో 6700 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతోంది.