ఈ ఏడాది తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. మే 2 నుంచి మూడు రోజుల పాటు ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. తొలుత ఆయన జర్మనీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి డెన్మార్క్ వెళ్తారు. తిరుగు ప్రయాణంలో మే 4న ప్యారిస్ చేరుకుంటారు. ఈ మేరకు మోదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బెర్లిన్లో జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఇండియా జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (IGC) 6వ ఎడిషన్లో ప్రధాని మోదీ, జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అనంతరం డెన్మార్క్ ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్హాగన్ వెళ్లనున్నారు. అక్కడ డెన్మార్క్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తున్న 2వ ఇండియా-నార్డిక్ సమ్మిట్లో మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ఐస్ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధానమంత్రులతో మోదీ చర్చించనున్నారు. కరోనా అనంతరం ఆర్ధిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నూతన ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో ప్యారిస్లో ఆగి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇటీవల తిరిగి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మెక్రాన్తో చర్చలు జరుపుతారు. గత ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ భారీ విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మోక్రాన్ను అభినందించనున్నారు.
Central Government: రైతులకు గుడ్ న్యూస్.. ఎరువులపై సబ్సిడీ పెంపు