దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరల పెరుగుతున్నా దేశంలో ఆ భారాన్ని రైతులపై పడనీయబోమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు కొనుగోలు చేసే డీఏపీ, పాస్పటిక్, పొటాషియం ఎరువులపై ఏకంగా 60 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏపీ బస్తాపై ప్రస్తుతం ఉన్న రూ.1,850 సబ్సిడీని రూ.2,501కి పెంచింది. ఇది గత ఏడాది కంటే 50 శాతం అధికం అని పేర్కొంది. డీఏపీ ధరలు, దాని ముడి సరుకు ధరలు దాదాపు 80 శాతం మేర పెరిగిన నేపథ్యంలో కేంద్రం రాయితీని పెంచింది.
దీనివల్ల రైతులకు నోటిఫై చేసిన పస్పాటిక్ అలాగే పొటాష్ ఎరువులు అందుబాటు ధరల్లో లభిస్తాయని తెలిపింది. పోషక ఆధారిత రాయితీ రూపంలో రైతులకు ఎరువులను సరఫరా చేస్తారు. దీనివల్ల రైతులు అందరికీ అవసరమైన ఎరువులు ఇబ్బందులు లేకుండా అందుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల డీఏపీ బస్తా ప్రస్తుతం ఉన్న రూ.1350 ధరకే లభించనుంది. ధర పెరిగిన మేరకు కేంద్రం రాయితీ అందిస్తున్న కారణంగా రైతుపై అధిక భారం పడటం లేదు.