PM Modi: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ, ఇటీవల పలు దేశాలతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్స్ గురించి సభకు వివరించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య సభలో ప్రధాని ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి నిరసనగా విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అయితే, ప్రధాని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థపై విపక్షాలకు అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు, కాంగ్రెస్ పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చెప్పారు. రాజ్యసభలో చర్చ జరిగే సమయంలో విపక్షాలు హుందాగా ఉండాలని, కానీ వారు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 9 దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని ప్రధాని వెల్లడించారు.
ముఖ్యంగా కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒప్పందాల గురించి మాట్లాడితే, ప్రజలకు బోఫోర్స్ గురించి ప్రస్తావించే వారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఆలోచనలు లేవు, విజన్ లేదు, ప్రణాళిక లేదు, వారు చేసిన గందరగోళాన్ని చక్కదిద్దడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని అన్నారు. యూపీఏ హయాంలో భారత్ 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ఇప్పుడు నాలుగో స్థానంలో ఉందని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోందని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో పీఎస్యూలకు తాళాలు వేయాల్సిన పరిస్తితి వచ్చింది. దేశంలో రైతుల్ని కాంగ్రెస్ మోసం చేసిందని, దేశంలో ఉన్న సన్న, చిన్నాకారు రైతుల గురించి ఆ పార్టీ ఎప్పుడూ ఆలోచించలేదని, బీజేపీ మాత్రం కిసాన్ సమ్మాన్ నిధిని ఇస్తూ రైతులకు ఆసరాగా నిలుస్తోందని చెప్పారు.కాంగ్రెస్ హయాంలో వారు జేబులు నింపుకోవడానికి మాత్రమే సరిపోయిందని ఆరో్పించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ప్రధాని అన్నారు.