Pakistan: పాకిస్తాన్ తన చరిత్రను తప్పుగా చెప్పుకోవడం అలవాటు. ముఖ్యంగా, భారత్ విషయంలో ఏం జరిగినా, ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయినా, చివరకు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)ని కోల్పోయినా కూడా తమదే పై చేయి అని అక్కడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరకు విద్యార్థులకు నిజాలు తెలియకుండా, తప్పుడు అంశాలను స్కూల్ పాఠ్యాంశాలుగా చేర్చుతోంది. తాజాగా, మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి కూడా అక్కడి టెక్ట్స్ బుక్స్లో తప్పుడు పాఠ్యాంశాన్ని చేర్చింది.
ఈ స్కూల్ బుక్స్లో భారత్-పాక్ మధ్య జరిగిన నాలుగు రోజుల ఘర్షణలో తామే పైచేయి సాధించినట్లు పాకిస్తాన్ చెప్పుకుంది. భారతదేశం ఘర్షణను ప్రేరేపించిందని, పాకిస్తాన్ సైన్యం ప్రతీకారంగా భారత వైమానిక స్థావరాలను నాశనం చేసిందని, పాకిస్తాన్ యుద్ధంగో గెలిచిందని తప్పుడు ప్రచారాన్ని చేసుకుంది.
అబద్ధం 1: పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదు.
పాక్ పాఠ్యపుస్తకంలో..‘‘6 మే 2025న, భారత దళాలు పాకిస్తాన్పై దాడి ప్రారంభించాయి, భారత ఆక్రమిత కాశ్మీర్లోని పహల్గామ్ పట్టణంలో జరిగిన ఘోరమైన దాడిలో పాక్ ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణలు చేశాయి, అక్కడ చాలా మంది మరణించారు. ఈ తప్పుడు ఆరోపణలన్నింటినీ పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ, భారతదేశం మే 7, 2025న పాకిస్తాన్పై సైనిక దాడి చేసింది.’’ అని పేర్కొంది.
అబద్ధం2: పాకిస్తాన్ భారత వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
పాకిస్తాన్ మిలిటరీ గొప్ప ధైర్య, నైపుణ్యాలతో భారత దాడికి ప్రతిస్పందించాయని, పాక్ ఆర్మీ భారత ఆక్రమణలో ఉన్న కాశ్మీర్లో అనేక భారత సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. భారత డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ 2025, మే 10న ఆపరేషన్ బన్యన్ ఉమ్ మర్సూస్ ప్రారంభించిందని పేర్కొంది. భారత వైమానిక దళం భారత ఎయిర్ఫోర్స్కు చెందిన 26 వ్యూహాత్మక ప్రదేశాలను విజయవంతంగా టార్గెట్ చేసింది. అనేక స్థావరాలను నాశనం చేసిందని పాకిస్తాన్ తన పాఠ్యాంశాల్లో రాసుకొచ్చింది.
అబద్ధం 3: భారత్ శాంతి కోసం వేడుకుంది.
పాక్ దాడిలో భారీగా నష్టపోయిన భారత్, శాంతి కోసం వేడుకుంది. భారత్కు శాంతి కోరడం తప్పా వేరే మార్గం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే అభ్యర్థించిన తర్వాత, పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఒప్పుకుంది.
అబద్ధం 4: ఫీల్డ్ మార్షల్ గౌరవం.
పాకిస్తాన్ సైన్యం యొక్క అత్యుత్తమ ప్రదర్శన, జనరల్ అసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి పొందారు – మొత్తం దేశానికి గర్వకారణమైన క్షణమని గొప్పలు చెప్పుకుంది.
నిజాలు ఇవే:
పాకిస్తాన్ తమ సొంత ప్రజల ముందు పరువు పోకుండా అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసింది. భారత దేశంలోని కొన్ని పార్టీల నేతలు కూడా పాక్ అబద్ధాలనే ఉటంకిస్తూ, భారత సైన్యాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే పాక్ అసత్యాలు ఏవిధంగా ఉన్నాయో తెలుస్తోంది.
నిజానికి పాకిస్తాన్ భారత దాడిని తట్టుకోలేకపోయింది. భారత వైమానిక దాడుల్లో పాక్ లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలు నాశనమయ్యాయి. ఈ విషయాలను స్వయంగా ఆ ఉగ్రవాద నాయకులే ఒప్పుకున్నారు. 100 కన్నా ఎక్కువ మంది ఉగ్రవాదులు మరణించారు. మోస్ట్ వాంటెండ్ మౌలానా మసూద్ అజార్ ఫ్యామిలీలో 10 మంది మరణించారు. ఇక భారత దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా, స్కర్దు, లాహోర్, బోలారీ వంటి ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి. దీనికి భారత్ సాక్ష్యంగా శాటిలైట్ చిత్రాలను కూడా చూపించింది.