కేరళలో మరో కొత్త వైరస్ కలకలం రేగింది. దీని పేరు నోరో వైరస్ గా వైద్యులు నిర్ధారించారు. ఇది ప్రధానంగా జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తిరువనంతపురం నగరంలో ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకిందని కేరళ వైద్యులు ధృవీకరించారు. నోరో వైరస్ డయేరియా- ప్రేరిపిత రోటవైరస్ మాదిరిగానే ఉంది. ఈ వైరస్ సోకిన పిల్లలకు చికిత్స చేయకపోతే ప్రాణాంతకరం కావచ్చని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.
కలుషిత నీరు, ఆహారం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో నీటి పరిశుభ్రతపై సరైన చర్యలు తీసుకుంటే వ్యాధిని అదుపు చేయవచ్చని అధికారులు చెప్పారు.నోరో వైరస్ సోకిన పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రజలంతా ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి జార్జ్ చెప్పారు. ఫుడ్ పాయిజనింగ్ అని ఫిర్యాదు చేసిన తర్వాత పిల్లల్లో నోరోవైరస్ ఇన్ఫెక్షన్ కనుగొన్నారు.
పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు అనుమానిస్తున్నారు.నోరోవైరస్ సోకిన రోగులు వాంతులు,విరేచనాలు, తలనొప్పి, శరీర నొప్పులతో బాధపడుతుంటారు. కలుషితమైన ఆహారం, నీరు వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుంది.లావెటరీని ఉపయోగించిన తర్వాత సబ్బుతో పదేపదే చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు ప్రజలను కోరారు.