నైజీరియా దేశంలో దారుణం జరిగింది. ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుడు ఘటనలో 50 మంది మరణించారు.ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చిలో పెంతెకోస్ట్ ఆరాధకులు గుమిగూడిన సమయంలో వారిని లక్ష్యంగా చేసుకొని ముష్కరులు దాడి చేశారని శాసనసభ్యుడు ఒగున్మోలసుయి ఒలువోలే తెలిపారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు.
ఓండో రాష్ట్రంలోని ఓవోలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చ్లో ప్రజలు ప్రార్థనలు చేసుకుంటున్నారు. అయితే చర్చిలోకి చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిగిపాడని.. చర్చ్ పీఠాధిపతి కూడా అపహరణకు గురయ్యారని నైజీరియా దిగువ శాసన సభ ప్రతినిధి అడెలెగ్బే టిమిలీయిన్ చెప్పారు. చర్చ్ లో జరిగిన కాల్పుల ఘటన అనంతరం తమ హృదయాలు బరువెక్కాయని ఒండో గవర్నర్ రోటిమి అకెరెడోలు ట్వీట్ చేశారు.
మృతుల సంఖ్యను అధికారులు వెంటనే అధికారికంగా విడుదల చేయలేదు. కనీసం 50 మంది మరణించారని టిమిలీన్ చెప్పారు. చర్చ్ లో అరాధకులు రక్తపు మడుల్లో పడి ఉండటంతో ప్రజలు విలపించారు.పిశాచాలు మాత్రమే ఇలాంటి దారుణచర్యకు పాల్పడతాయని నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారి వ్యాఖ్యానించారు.చర్చిపై దాడి వెనుక ఎవరున్నారో ఇంకా తెలియరాలేదు.ఓవో చరిత్రలో ఇంత దారుణమైన ఘటన ఎప్పుడూ ఎదురుకాలేదని శాసనమండలి సభ్యుడు ఓలువోలే అన్నారు.