Nitish Kumar Floor Test: బిహార్లో బీజేపీతో ఉన్న బంధాన్ని తెంచుకున్న ఆర్జేడీ సహా మహాకూటమితో కలిసి 8వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ఆయన బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మహాకూటమిలోని 7 పార్టీలకు చెందిన 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్లు గవర్నర్ ఫాగు చౌహాన్కు ఇచ్చిన లేఖలో నితీష్ వెల్లడించారు. ఈ నెల 24న అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష జరగనున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం స్పీకర్ పదవిలో బీజేపీ నేత ఉండడంతో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా స్పీకర్ను మార్చాలని అధికార కూటమి భావిస్తోంది. అయితే ప్రస్తుత స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామాకు ససేమిరా అనడంతో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు.
ఇప్పటికే స్పీకర్ విజయ్కుమార్ సిన్హాపై అవిశ్వాస తీర్మానాన్ని 55 మంది మహాకూటమి శాసనసభ్యులు ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఈ తీర్మానం ఇచ్చిన రెండు వారాల తర్వాతే అసెంబ్లీ ముందుకు వస్తుంది. అందుకే ఆగస్టు 24వరకు వేచి చూడాల్సిన అవసరం ఏర్పడింది. మహఘటబంధన్ కూటమికి ప్రస్తుతం 164 ఎమ్మెల్యే మద్దతు ఉంది. 243 సభ్యులు గల అసెంబ్లీలో 122 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. అవసరమైన బలం ఉన్నప్పటికీ అనవసర రిస్క్ తీసుకోకూడదని నేతలు భావిస్తున్నారు. కొత్త స్పీకర్ ఆర్జేడీ నుంచి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.
PM Narendra Modi: చిన్నారులతో ప్రధాని మోడీ రక్షాబంధన్ వేడుకలు.. వారంతా ఎవరంటే?
మరోవైపు కేబినెట్ విస్తరణపై నితీష్ కుమార్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భాగస్వామ్య పార్టీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16న మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. కొన్ని కీలక శాఖలు ఆర్జేడీకి అప్పగించే అవకాశం ఉంది. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు వస్తాయో త్వరలో తెలియనుంది.