మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాసేపటికే బీరెన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఐదురోజులే పనిదినాలు ఉండేలా కొత్త జీవో విడుదల చేశారు. ఈ నిర్ణయంతో మణిపూర్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేయనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.
మార్చి నుంచి అక్టోబరు వరకు ఉదయం 9 గంటలకు మొదలయ్యే ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం ఐదున్నర గంటల వరకు కొనసాగనున్నాయి. అయితే నవంబరు నుంచి ప్రారంభం కానున్న శీతాకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఉదయం 9 గంటలకు మొదలయ్యే ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం మాత్రం మరో అరగంట ముందే ముగిసేలా మణిపూర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలానే మధ్యలో వచ్చే లంచ్ బ్రేక్ కోసం అరగంట సమయం ఇచ్చారు. కాగా వారానికి ఐదురోజులే పనిదినాలుగా ఉంటాయని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.