India-Pak Tensions: ఆపరేషన్ సిందూర్తో భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుంది. దాయాది దేశం రెచ్చగొట్టే చర్యలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు మోడీ సర్కార్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అన్ని వ్యవస్థల పని తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలోనే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సీఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో, ఎయిర్ పోర్టుల్లో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. కాగా, ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. కేంద్రమంత్రి ఇంట్లో ఈ కీలక సమావేశం జరిగింది.
Read Also: Amala Paul : నేను హీరోయిన్ని అనే విషయం నా భర్తకి చెప్పలేదు..
అయితే, చొరబాటు ఘటనలు జరుగుతున్న తరుణంలో పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకుంటున్న ఆయా రాష్ట్రాలు ఇప్పటికే కీలక చర్యలు తీసుకుంటున్నాయి. భారతదేశంలోకి చొరబాటుకు ప్రయత్నించిన పాక్ కు చెందిన ఓ వ్యక్తిని పంజాబ్ సరిహద్దు దగ్గర బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు హతమార్చారు. రాజస్థాన్లో 1,037 కిలోమీటర్లున్న పాక్ సరిహద్దును బంద్ చేశారు. ఎవరైనా సరిహద్దుల దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే.. కాల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలోని సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్ఎఫ్ గట్టిగా తిప్పికొట్టింది. ఈ దాడుల్లో సుమారు ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ నేడు కూడా ఎల్ఓసీకి ఆవలివైపు నుంచి భారీ స్థాయిలో కాల్పులు జరుపుతుంది. ముఖ్యంగా యూరి, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో వీటి తీవ్రత భారీగా కనిపిస్తుంది. ఈ కాల్పుల్లో చాలా మంది ప్రజలు తమ ఇళ్లు ఖాళీ చేసి దూర ప్రాంతాలకు వెళ్తున్నారు.