దేశవ్యాప్తంగా ఫ్రీ వ్యాక్సిన్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే తొలిరోజే టీకా పంపిణీలో సరికొత్త రికార్డు సృష్టించింది భారత్. ఆయా రాష్ట్రాల్లో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ జరిగింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 75 లక్షల మందికి టీకాలు అందించారు. ఏప్రిల్ 2న 42 లక్షల 65 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు ఇదే రికార్డుగా ఉండేది. రాష్ట్రాలకు కేటాయించిన 25 శాతం వ్యాక్సిన్లను వెనక్కి తీసుకున్న కేంద్రం.. అందరికీ ఫ్రీ టీకా అంటూ కొత్త పాలసీని ప్రకటించింది. వ్యాక్సిన్ ఉత్పత్తిలో కేంద్రమే 75 శాతం టీకాలు కొని రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తుంది. ఇప్పటివరకు 29 కోట్ల టీకాలను కొనుగోలు చేసి.. రాష్ట్రాలకు ఫ్రీగా ఇచ్చినట్లు చెప్పింది. రాబోయే మూడు రోజుల్లో మరో 24 లక్షల వ్యాక్సిన్లను అందిస్తామని తెలిపింది.
టీకా పంపిణీలో రాష్ట్రాలు కూడా స్పీడ్ పెంచుతున్నాయి. ఇప్పటివరకు అత్యల్ప టీకా పంపిణీ ఉన్న అసోం కొత్త టార్గెట్ పెట్టుకుంది. రాబోయే పది రోజుల్లో 3 లక్షల టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక 70 శాతం మందికి టీకా పంపిణీ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేది లేదని మహారాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. అటు కర్ణాటకలోనూ రోజుకు 7 లక్షల మందికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో టీకా పంపిణీ మరింత ఊపందుకుంటుందని అధికారులు చెబుతున్నారు.