Cabinet Meeting: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ కీలక సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత ఈ సమావేశం జరుగబోతోంది. పాకిస్తాన్పై సైనిక చర్య తీసుకుంటారనే ఊహాగానాల నడుమ ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే, త్రివిధ దళాల అధిపతులు, ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్తో ప్రధాని మోడీ కీలక సమావేశాలు నిర్వహించారు. మరోవైపు భారత్ వరస ఆంక్షలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
క్యాబినెట్ సమావేశంలో భారత్, పాక్ ఉద్రిక్తత కీలకం కాబోతోంది. రేపటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే, బుధవారం(రేపు) దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్కి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 259 ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. యుద్ధం వస్తే ప్రజలు తమని తాము ఎలా కాపాడుకోవాలనే దానిపై ఈ డ్రిల్స్ జరుగుతున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వరసగా సమావేశాలతో కేంద్రం బిజీగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో ప్రధాని కీలక చర్చలు నిర్వహించారు. త్రివిధ దళాలతో ఇటీవల జరిగిన సమావేశంలో సైన్యానికి ప్రధాని పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో పాకిస్తాన్ టార్గెట్గా కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.