Rs.2,000 Notes Withdrawal: రూ. 2,000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలన్న ఆర్బీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మే 30న దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై పిటిషనర్, ఆర్బీఐ తరుపున న్యాయవాదుల వాదనలను న్యాయమూర్తి సతీస్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ లతో కూడిన ధర్మాసనం వింది. దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది.
Read Also: Telangana Jana Garjana: కాంగ్రెస్ వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పింఛన్: రాహుల్
రూ. 2000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకునే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేదని, ఈ విషయంలో కేంద్రం మాత్రమే నిర్ణయం తీసుకోగలదని పిటిషనర్ రజనీష్ భాస్కర్ గుప్తా తన పిల్ లో పేర్కొన్నాడు. ఏదైనా డినామినేషన్ నోట్లను జారీ చేయకుండా నిలిపివేసే స్వతంత్ర అధికారం ఆర్బీఐకి లేదని, 1934 ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 24 (2) ప్రకారం కేంద్రానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. అయితే ఆర్బీఐ మాత్రం కరెన్సీ నిర్వహణ, ఆర్థిక విధానానికి సంబంధించిన అంశం అని తెలిపింది.
మే 19న ఆర్బీఐ రూ. 2,000 నోట్ల చలామణిని ఉపసంహరించుకుంది. సెప్టెంబర్ 30 వరకు నోట్లను మార్చుకునేందుకు సమయం ఇచ్చింది. అన్ని బ్యాంకుల్లో ఈ గడువులోగా నోట్లను మార్పిడి చేసుకోవచ్చని, అకౌంట్లలో జమచేయవచ్చని తెలిపింది. ఒకసారి రూ. 20,000 వరకు రూ.2000 నోట్లను మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఖాతాల్లో డిపాజిట్ పై ఎలాంటి పరిమితి విధించలేదు.