లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ అకస్మాత్తుగా ఢిల్లీ యూనివర్సిటీలోకి వచ్చేశారు. అయితే రాహుల్ రాకపై విశ్వవిద్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ పర్యటన కారణంగా విద్యార్థి పాలన కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని పేర్కొంది. అంతేకాకుండా ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించింది. రాహుల్ గాంధీ ఇలా చేయడం ఇది రెండవసారి అని.. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి ఎటువంటి సమాచారం లేకుండా వస్తున్నారని ప్రొక్టర్ కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది. మళ్లీ ఇలా జరగకూడదని ఆశిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Terror Conspiracy Case: నేడు సిరాజ్, సమీర్లను కస్టడికి తీసుకోనున్న పోలీసులు
రాహుల్గాంధీ గంటసేపు డీయూఎస్యూ కార్యాలయంలో ఉన్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది చుట్టుముట్టారు. దీంతో విద్యార్థులకు తీవ్ర అంతరాయం కలిగిందని వర్సిటీ పేర్కొంది. ఎన్ఎస్యూఐ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. ఇటువంటి చర్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. అయితే ప్రైవేటు అతిథికి ముందుస్తు అనుమతి పొందాలని ఎటువంటి నియమం లేదని విద్యార్థి సంఘం నేత రోనక్ ఖత్రి పేర్కొన్నారు. డీయూఎస్యూ కార్యాలయంలో శాంతియుతంగా కార్యక్రమం జరిగిందని.. ఏ అతిథినైనా ఆహ్వానించే పూర్తి హక్కు విద్యార్థి సంఘానికి ఉందని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: US: త్వరలోనే పెళ్లి.. ఇంతలో దుండగుడి కాల్పుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి
ఇటీవల బీహార్లో కూడా ఇదే మాదిరిగా రాహుల్గాంధీ వెళ్లే ప్రయత్నం చేశారు. స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఏదో విధంగా యూనివర్సిటీలోకి వెళ్లి విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. ‘‘శిక్ష న్యాయ్ సంవాద్’’లో భాగంగా బీహార్లోని దర్భంగా జిల్లాలోని అంబేద్కర్ హాస్టల్లో విద్యార్థులను కలిశారు. అధికారిక అనుమతి లేకుండా జరిగిన కార్యక్రమం కారణంగా రాహుల్గాంధీపై రాష్ట్రంలోని 100 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరోసారి ఢిల్లీ యూనివర్సిటీలోకి రావడంతో కేసులు నమోదు చేస్తామని విశ్వవిద్యాలయం హెచ్చరించింది.