ఉత్తరాఖండ్ లో జరుగుతున్న కుంభమేళాపై కరోనా కోరలు చాస్తోంది. కుంభమేళాకు హాజరయ్యే భక్తులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఇక బుధవారం రోజున నిర్వహించిన రాజస్నానం కార్యక్రమంలో లక్షల సంఖ్యలో సాధువులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే, ఇలా రాజస్నానం చేసేందుకు హాజరైన నాగా సాధువుల్లో 30 మందికి కరోనా సోకింది. దీంతో కుంభమేళాలో అలజడి మొదలైంది. నిరంజని, జావాతో పాటుగా అనేక అఖాడాకు చెందిన సాధువులు కరోనా బారిన పడినట్టు వైద్యనిపుణులు చెప్తున్నారు. సాధువులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. ఇక ఆల్ ఇండియా అఖాడా పరిషత్ నాయకుడు మహంత్ నరేంద్రగిరి కరోనా బారిన పడ్డారు. అదే విధంగా నిరంజని అఖాడా కుంభమేళాను వీడేందుకు సిద్ధం అయ్యింది. నిరంజని అఖాడాకు చెందిన సాధువులు కుంభమేళాను వీడేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇదిలా ఉంటె, మహా నిర్వాణ అఖాడా హెడ్, ప్రముఖ సాధువు స్వామి కపిల్ దేవ్ కరోనాతో మృతి చెందారు. డెహ్రాడూన్ లో చికిత్స పొందుతూ మృతి చెందటంతో మహా నిర్వాణ అఖాడాలో ఆందోళనలు నెలకొన్నాయి.