Congress angry over the release of convicts in the Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్న నళిని, మరో ఐదుగురు వ్యక్తులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 1991 మే21న తమిళనాడు శ్రీపెరంబుదూర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీ వెళ్లిన సందర్భంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) ఉగ్రవాదులు ఆత్మహుతికి పాల్పడ్డారు. ఈ దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు.
ఈ హత్య కేసులో దోషులుగా ఉన్న నళినీ శ్రీహరన్ తో పాటు మరో ఐదుగురు దోషులను విడుదల చేయాలన్న సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో రాజీవ్ గాంధీ హంతకులను జైలు నుంచి విడుదల చేయాలని సోనియాగాంధీ కోరారు.. అయితే ఆమె నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. సోనియాగాంధీ వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ అంగీకరించదని.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. రాజీవ్ గాంధీ హత్య సాధారణ నేరం కాదని.. ఇది జాతీయ సమస్య అని అన్నారు.
Read Also: Midday Meal in Bihar: బల్లి పడిందన్నా బలవంతంగా తినిపించారు.. 200మంది పరిస్థితి ఏమైందంటే
రాజీవ్ గాంధీ హత్య కేసులో మొత్తం ఏడుగురు దోషులకు మరణశిక్ష విధించారు. అయితే 2000లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, రాజీవ్ గాంధీ భార్య సోనియాగాంధీ జోక్యంతో నళిని శ్రీహరన్ శిక్షను జీవిత ఖైదుకు తగ్గించారు. 2008లో రాజీవ్ కుమార్తె ప్రియాంకాగాంధీ తమిళనాడులోని వెల్లూరు జైలుతో నళినిని కలిశారు. 2014లో మరో ఆరుగురి శిక్షలను కూడా తగ్గించారు. అదే ఏడాది అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వారిని విడిపించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది మే నెలలో దోషుల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్ ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. దీంతో తనతో పాటు ఇతరును కూడా విడుదల చేయాలని నళిని కోర్టును ఆశ్రయించారు.
ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ సీనియర నేత జైరాం రమేష్ కూడా అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఆమోదయోగ్యం కాదని.. పూర్తిగా తప్పు అని.. కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఈ సమస్యపై భారతదేశ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించకపోవడం అత్యంత దురదృష్టకరం అని అన్నారు.