CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్తో పాటు కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పుజా ఎంపీ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాన మంత్రి అని అన్నారు. ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని, మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర చేశారని, గత 20 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని ఆయన కాకుంటే ఇంకెవరు ప్రధాని అవుతారని ప్రశ్నించారు.
ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, వయనాడ్ నుంచే ఆయన 20 ఏళ్లుగా ప్రధానిగా ఉంటారని, వయనాడ్ ప్రజలు ఎంపీ కోసం ఓటు వేయడం లేదని, ప్రధాని పదవి కోసం వేస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ 10 ఏళ్లు వారణాసి నుంచి ప్రధానిగా ఉంటే, రాహుల్ గాంధీ 20 ఏళ్లు వయనాడ్ నుంచి ప్రధానిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంలు లేకుండా బీజేపీకి 180 సీట్లు కూడా రావని ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. నరేంద్రమోడీ, ఈవీఎంలు ఉన్నంత వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదని బీజేపీ నేతలే చెబుతున్నారని ఆరోపించారు.
Read Also:Amit Shah: మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తాం..
ఈవీఎంలపై తమకు అనుమానం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈవీఎంలు తీసేయడానికి ప్రధాని మోడీకి ఎందుకు భయమవుతోందని ప్రశ్నించారు. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎందుకు ఎన్నికలు జరపడం లేదని అన్నారు. ఈవీఎంలతో ప్రధాని మోడీకి ఏం సంబంధం ఉందని, బీజేపీకి ఎందుకు భయమవుతోందని అడిగారు. ప్రపంచం మొత్తం పేపర్ బ్యాలెట్ ఉపయోగిస్తుంటే, భారత్లోనే ఈవీఎంలను ఉపయోగిస్తున్నారని అన్నారు. మీరు పేపర్ బ్యాలెట్ ఉపయోగించి పరీక్ష నిర్వహించాలని, తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని, పేపర్ బ్యాలెట్ ఉపయోగించడం ద్వారా నిజమేంటో తెలుస్తుందని ఆయన అన్నారు.