PM Modi: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రామ మందిర అంశాన్ని కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకున్నాయని అన్నారు. ‘‘మనం పుట్టనప్పుడు, మన పార్టీ కూడా పుట్టనప్పుడు.. ఆ సమయంలో ఈ విషయాన్ని కోర్టులో విచారించవచ్చు. సమస్యకు పరిష్కారం ఉండవచ్చు. భారతదేశం విడిపోయిన సమయంలో ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ ఓటు బ్యాంకు రాజకీయల కోసం చేయలేదు’’ అని పీఎం ఆరోపించారు.
కోర్టులో కేసు నడుస్తునప్పుడు కూడా కోర్టు తీర్పును ఆలస్యం చేసేందుకు ప్రయత్నించారని, దీనిని ఓ రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకున్నారని ప్రధాని మండిపడ్డారు. ఒక వేళ రామమందిరం నిర్మిస్తే, వారు మిమ్మల్ని చంపేస్తారు, ఇలా వారు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డారని నిందించారు. ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామ మందిరాన్ని నిర్మించామని అన్నారు. గతంలో సోమనాథ్ మందిరానికి డాక్టర్ రాజేంద్ర బాబు వెళ్లాని అనుకున్నారు, ఆ సమయంలో జనసంఘ్ కానీ, బీజేపీ కానీ లేవు, అయితే అతను వెళ్లేందుకు అనుమతి నిరాకరించారని కాంగ్రెస్ని దుయ్యబట్టారు.
Read Also: Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్ స్కీమ్పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
రామ మందిరాన్ని కట్టిన వాళ్లు, దాని కోసం కష్టపడిన వాళ్లు, మీ పాపాలన్నింటిని మరిచిపోయారని మీరు గర్వపడాలి, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆహ్వానించారు, అయినా కూడా మీరు తిరస్కరించారని కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఇలాంటివే జరుగుతాయని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో అక్కడి ప్రజలు తమ వేషధారణను ధరించాలని కోరుతారు, అలా నేను ధరించినా వారు ఎగతాళి చేస్తారు, వారిలో చాలా ద్వేషం ఉందని ఆరోపించారు.
రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకకు ఆహ్వానించాలని ట్రస్టు తన వద్దకు వచ్చినప్పుడు తనకు పెద్ద బాధ్యత అప్పగిస్తున్నారని, అయితే దీని కోసం ఎలా తనను తాను సమర్థుడిగా చేసుకోవాలనే విషయంపై కొందరు సాధువులను సంప్రదించి 11 రోజుల అనుష్టానాన్ని స్వీకరించానని ప్రధాని మోడీ చెప్పారు. దక్షిణ భారతదేశంలోని శ్రీరంగం వెళ్లానని, అక్కడ కంబ రామాయణాన్ని చదివానని, 800 ఏళ్లకు పూర్వం కంబ రామాయణం సృష్టించినప్పుడు మొదటి పారాయణం ఇక్కడే జరిగిందని వారు తనకు చెప్పారని అన్నారు. రామమందిర విషయంలో 500 ఏళ్ల పోరాటాన్ని చూశామని, 140 కోట్ల విశ్వాసాన్ని, కలల్ని నేను చూశానని, దేశంలోని పేద ప్రజలు డబ్బులు ఇచ్చి దేవాలయాన్ని నిర్మించారని అన్నారు.