Asaduddin Owaisi: తమిళనాడులో కొత్త పొత్తు పొడిచింది. హైదరాబాద్కే పరిమితమైన ఎంఐఎం పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో అప్నాదళ్(కే)తో పొత్తు కుదుర్చుకున్న మజ్లిస్ పార్టీ, ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తును ప్రకటించింది. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఆ పార్టీకి శనివారం ఎంఐఎం మద్దతు ప్రకటించింది. గతంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని, భవిష్యత్తులో పొత్తు పెట్టుకోకూడదని భావిస్తోంది.
Read Also: Chandrababu: మూడు జెండాలతో వచ్చినా.. మూడు పార్టీలతో వచ్చినా.. అజెండా ఒక్కటే
ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. తమిళనాడు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2026లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తామని అన్నాడీఎంకే ప్రకటించడంతో ఎంఐఎం ఆ పార్టీకి మద్దతు అందిస్తోంది. గతంలో ఎంఐఎం 2021లో టీటీవీ దినకరన్కి చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఎఎంఎంకే)తో పొత్తు పెట్టుకుంది. ఆ సమయంలో మూడు స్థానాల నుంచి పోటీ చేసింది. అప్పుడు అన్నాడీఎంకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగంగా ఉండేది. తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలివిడతలో ఎన్నికలు జరగనున్నాయి.