జమ్ముకాశ్మీర్లో ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలంటే కాంగ్రెస్ వల్ల అయ్యే పని కాదని .. ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 300 స్థానాల్లో గెలుపొందాలని, అది అసాధ్యమని అన్నారు. అధికరణ 370 రద్దుపై తన మౌనం గురించి జమ్మూ-కాశ్మీరులోని పూంఛ్ జిల్లా, కృష్ణఘాటి ఏరియాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, దీనిని కేవలం సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలవని ఆయన పేర్కొన్నారు. ‘మేము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 300 మంది ఎంపీలు అవసరం, 2024 ఎన్నికల్లో 300 మంది ఎంపీలు గెలుపొందాలి. అప్పుడే ఆర్టికల్ 370ని పునరిద్ధరించగలం. అంత మంది ఎంపీలు గెలిచేదేప్పుడు..? ప్రస్తుతం ఆ పరిస్థితి కాంగ్రెస్లో కనిపించడం లేదు. అందుకే అధికరణ 370ని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేయలేను’ అని ఆజాద్ వ్యాఖ్యానించారు.
దీంతో కాశ్మీర్లో కాంగ్రెస్ ఓట్లను కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆజాద్ అన్నారు. ఇప్పటికి కాంగ్రెస్ గత వైభవాన్ని సాధించలేకుంటే ఇకపై కష్టతరంగా మారుతుందని ఆయన అన్నారు. కేవలం ఒక్క జమ్ము కాశ్మీర్ కాదు.. దేశంలో అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పట్టును కోల్పోతుందని ఆజాద్ వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీని ఎదుర్కొవడానికి యూపీయే కూటమి పోరాడాల్సి ఉన్నా , ప్రస్తుత తరుణంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆజాద్ అన్నారు. యూపీఏ కూటమితోనే బీజేపీని ఢీకొనగలమని ఆదిశగా కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆజాద్ అన్నారు.