దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందణ్ణ కీలక పాత్రలో అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో ‘సీతారామం’కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ నిర్వహించింది. కింగ్ అక్కినేని నాగార్జున ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”అశ్వినీదత్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన కంటే నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు స్వప్న, ప్రియాంక. దత్ గారికి వారిద్దరూ పెద్ద అండ. ‘మహానటి, జాతిరత్నాలు’… ఇప్పుడు ‘సీతారామం’.. వరుసగా అద్భుతమైన విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. వైజయంతి బ్యానర్ లో ఐదు సినిమాలు చేశాను. బ్యానర్ పై ఎన్టీఆర్ గారి ఫోటో వుంటుంది. అలాగే నాన్నగారు, చిరంజీవి గారు వైజయంతిలో చిత్రాలు చేశారు. వైజయంతి పేరుని స్వప్న, ప్రియాంక నిలబెడుతున్నారు. ‘సీతారామం’ చూసి చాలా జెలసీ ఫీలయ్యాను. నాకు రావాల్సిన రోల్ దుల్కర్ కి వెళ్ళింది. ‘గీతాంజలి, సంతోషం, మన్మధుడు’ రోజులు గుర్తుకు వచ్చాయి. ‘సీతారామం’ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. లవ్, రొమాన్స్ చిత్రాలని ప్రేక్షకులు మళ్ళీ గొప్పగా ఆదరించారు. దర్శకుడు హను చాలా వివరంగా, అద్భుతంగా ఈ చిత్రాన్ని తీశారు. ఇంత అందమైన చిత్రం చూసి చాలా రోజులౌతుంది. దుల్కర్ గొప్ప ఛార్మింగ్ వున్న నటుడు. అతన్ని చూడగానే ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. గత వారం విడుదలైన ‘బింబిసార, సీతారామం’ చిత్రాలని గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చారు” అని అన్నారు.
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, ”మా సినిమాను ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై ప్రేక్షకుల చూపిస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతిని ఇస్తుంది. స్వప్న దత్ అద్భుతమైన నిర్మాత. తనకి అసాధ్యం అంటూ ఏమీ వుండదు. ‘మహానటి’, ఇప్పుడు ‘సీతారామం’…. నా కోసం ఎప్పుడూ ప్రత్యేకమైన కథలే ఎంపిక చేస్తారు స్వప్న. రామ్ పాత్ర నా కెరీర్ లో చాలా స్పెషల్. ఇంత గొప్ప పాత్రని రాసిన హను గారికి కృతజ్ఞతలు. తెలుగు, తమిళ, మలయాళం ఇలా అన్ని చోట్ల సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఒకొక్కరు ఏడు-ఎనిమిదిసార్లు సినిమాని చూశామని చెబుతుంటే చాలా ఆనందంగా వుంది. నాగార్జున గారు ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. నేను నాగార్జున గారికి పెద్ద ఫ్యాన్ ని” అని చెప్పారు.
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ, ”ఈ విజయం మాటల్లో చెప్పలేని గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. సినిమాని ఇంత గొప్ప ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. సీత లాంటి ఐకానిక్ పాత్ర ఇచ్చిన దర్శకుడు హను గారికి, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా, అశ్వనిదత్, స్వప్న, ప్రియాంక అందరికీ హృదయపూర్వం కృతజ్ఞతలు. అశ్వినిదత్ గారు నా మార్గదర్శి. దుల్కర్ లాంటి గ్రేట్ కోస్టార్ లేకుండా ఈ జర్నీ జరిగేది కాదు. దుల్కర్ కి బిగ్ థాంక్స్” అని అన్నారు. దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ, ”ఐదవ తేదీ నుండి ఒక ఊహా ప్రపంచంలో బ్రతుకున్నట్లుగా వుంది. ఇంతకు ముందు నాలుగు సినిమాలు తీశాను. కానీ అప్పుడింత ఆదరణ లేదు. మొదటిసారి ఈ ఆదరణ చూస్తున్నాను. ఎప్పటికీ మర్చిపోలేని ఫీలింగ్ ఇది. ‘సీతారామం’ నాకు బాగా దగ్గరైన కథ. ‘సీతారామం’ కథ దృశ్య రూపంలోకి మారడానికి చాలా మంది కృషి వుంది. తెరపై కనిపిస్తున్న రామ్ సీతలతో పాటు తెరవెనుక చాలా మంది పని చేశారు. వారందరీకి పేరుపేరునా థాంక్స్” అని తెలిపారు.
నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ, ”నాగార్జున మా హీరో. మా బ్యానర్ అత్యధికంగా ఐదు చిత్రాలు చేశారు. తర్వాత చిరంజీవి గారు నాలుగు చిత్రాలు చేశారు. ‘సీతారామం’ సినిమా తీస్తున్నపుడు నాగార్జున గారే గుర్తుకు వచ్చారు. వారితో సినిమాలు నిర్మించిన రోజులు మర్చిపోలేనివి. అలాగే మా బ్యానర్ లో ఎక్కువ చిత్రాలు చేసిన శ్రీదేవి, జయప్రదలను గుర్తు చేసుకున్నపుడు ‘సీతారామం’లో మృణాల్ కనిపిస్తోంది. ‘మహానటి’, ఇప్పుడు ‘సీతారామం’తో రెండు విజయాలు ఇచ్చిన దుల్కర్ మా సొంత హీరో అయిపోయారు. దర్శకుడు హనుగారి, సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి, ఈ ఈవెంట్ కి వచ్చిన నాగార్జున గారికి మరోసారి కృతజ్ఞతలు” అని అన్నారు. ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ, ”దత్ గారితో నాది నలబై ఏళ్ల జర్నీ. నలభై ఏళ్లుగా ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు వారి పిల్లలు కూడా చాలా కష్టపడి బ్యానర్ పేరు నిలబెట్టడం చాలా ఆనందంగా వుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో మరిన్ని గొప్ప సినిమాలు రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.