Samantha:’ఫ్యామిలీ మ్యాన్ -2′ వెబ్ సీరిస్ తో సమంత పాన్ ఇండియా స్టార్ గా అవతరించింది. ఆ తర్వాత వచ్చిన ‘యశోద’ చిత్రం కూడా నాలుగు భాషల్లో విడుదలై సమంతకు మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు అదే బాటలో ‘శాకుంతలం’ కూడా విడుదల కాబోతోంది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్ బ్యానర్ లో నీలిమా గుణ నిర్మించిన ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ ప్లే చేసింది. సినిమా అనేది లార్జర్ దేన్ లైఫ్గా ఉండాలంటూ ప్రతి ఫ్రేమ్ను అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ గుణశేఖర్ కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ‘శాకుంతలం’ను రూపొందించారు. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 14న త్రీడీ వర్షన్ తో సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నామని కొద్ది రోజుల క్రితం చిత్ర బృందం తెలిపింది.
‘శాకుంతలం’ తొలి కాపీని దర్శకుడు గుణశేఖర్ తాజాగా సిద్ధం చేశారు. దాన్ని ఇటీవల వీక్షించిన సమంత తన మనసులోని భావాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. ”’శాకుంతలం’ను ఎంతో అందంగా తెరకెక్కించిన గుణశేఖర్ గారూ.. మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు. మన ఇతిహాసాలలో ఒక్కటైన శాకుంతలానికి మీరు జీవం పోశారు. కుటుంబ ప్రేక్షకులు ఇందులోని భావోద్వేగాలకు కరిగిపోతారు. ఇప్పుడెప్పుడు వారు ఈ సినిమా చూస్తారా అనిపిస్తోంది. పిల్లలు కూడా ఈ మ్యాజికల్ వరల్డ్ ను భలే లవ్ చేస్తారు. నా ఈ అద్భుతమైన ప్రయాణానికి కారణమైన ‘దిల్’ రాజు, నీలిమకు ధన్యవాదాలు. ‘శాకుంతలం’ ఎప్పటికీ నా మదికి దగ్గరగా ఉండే సినిమా” అని సమంత పేర్కొంది.
‘శాకుంతలం’ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు. శేఖర్ వి. జోసెఫ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని విజువల్గానే కాకుండా మ్యూజికల్గానూ ఆడియెన్స్కు ఆమేజింగ్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వటానికి రీ-రికార్డింగ్ను బుడాపెస్ట్, హంగేరిలోని సింఫనీ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రంలో డా. ఎం.మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సుసేన్ గుప్తా కీలక పాత్రలను పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం ప్రధాన ఆకర్షణ కానుంది.
https://twitter.com/Samanthaprabhu2/status/1635530410108043264